ఇమ్మాన్యుయేల్.. నీది మామూలు టాలెంట్ కాదురా బాబూ!
on May 4, 2021
'జబర్దస్త్' షోతో చాలా మంది కమెడియన్స్ లైమ్ లైట్ లోకి వచ్చారు. తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. ఒక్కోసారి వారిలో ఉండే టాలెంట్ చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా కమెడియన్ ఇమ్మానుయేల్ కూడా ఇలాంటి లిస్ట్ లో చేరిపోయాడు. చూడడానికి నల్లగా ఉన్నా.. అదే తన బలంగా చేసుకొని బుల్లితెరపై దూసుకుపోతున్నాడు. 'జబర్దస్త్' షోలో వర్షతో కలిసి ఇమ్మాన్యుయేల్ చేసే కామెడీ మాములుగా ఉండదు.
ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క 'జబర్దస్త్' షోలో మాత్రమే కాకుండా ఏ షోలైనా వీరిద్దరికీ స్పేస్ ఇవ్వాల్సిందే. అంతగా వీరి క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇమ్మాన్యుయేల్. ఈ మధ్యకాలంలో చాలా ఈవెంట్స్ లో ఈ కమెడియన్ కనిపిస్తున్నాడు. చూడడానికి అమాయకంగా ఉన్నా.. అతడికి ఉన్న క్రేజ్ తో ముందువరుసలో ఉంటున్నాడు. తాజాగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే టీవీ షోలో పాల్గొన్నాడు ఇమ్మాన్యుయేల్.
మదర్స్ డే సందర్భంగా మే 8న ప్రసారం కానున్న ఈ షోలో అమ్మ పాట పాడి అందరినీ ఆకట్టుకున్నాడు ఇమ్మాన్యుయేల్. 'నాని' సినిమాలో 'పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా' అనే పాట అందుకున్న ఇమ్మాన్యుయేల్.. పాటలో వచ్చే ఫిమేల్ వెర్షన్ ను కూడా తనే పాడి ఆశ్చర్యపరిచాడు. ఈ పాట విన్నవారంతా ఫిదా అయ్యారు. ప్రతీ ఒక్కరూ ఈ పాటకు కనెక్ట్ అయ్యారు. హైపర్ ఆది అయితే.. 'నీది మామూలు టాలెంట్ కాదురా బాబు' అంటూ ఇమ్మాన్యుయేల్ ను తెగ పొగిడేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.