నన్ను క్షమించండి.. ఏపీ రాజధాని వివాదంపై ప్రదీప్ స్పందన
on Jun 21, 2021
యాంకర్ ప్రదీప్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఓ టీవీ షోలో ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రదీప్ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ప్రదీప్ పై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్ ఎలా మాట్లాడతారని.. ప్రజల మనోభావాలు కించపరిచేలా వ్యవహరిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ప్రదీప్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఏపీ పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది.
దీంతో ఈ వివాదంపై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ నొప్పించలేదని, ఎవరినీ కించపర్చాలని ఈ విధంగా చేయలేదని చెప్పాడు. రీసెంట్గా జరిగిన ఓ షోలో రాష్ట్రం-రాజధాని అనే అంశంపై ప్రశ్నలు అడుగుతుండగా ఆ అంశం తప్పుదారి పట్టిందని పేర్కొన్నాడు.
తాను సిటీ పేరు చెప్పి, ఈ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడగడం జరిగిందని.. అయితే అవతలి వ్యక్తి మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ పూర్తి సంభాషణ తప్పు దోవలో వెళ్లిందని అన్నాడు. దీని ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. వాస్తవానికి ఇలాంటి అంశాలకు తాను దూరంగా ఉంటానని, ప్రేక్షకులకు వినోదం అందించడమే తన ప్రాధాన్యత అని.. అందుకు మీ ఆశీస్సులు కావాలని ప్రదీప్ అన్నాడు.