సుధీర్ కోసం ఇంద్రజ ఎందుకు ఏడ్చింది?
on Jun 27, 2022
నటి ఇంద్రజ బుల్లితెరపై జడ్జిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. మల్లెమాలకు చెందిన `శ్రీదేవి డ్రామా కంపెనీ` కామెడీ షో ద్వారా ఇంద్రజ ఫుల్ టైమ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంతో ఇంద్రజ కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోలో రోజా ప్లేస్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రజ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ గురించి మాట్లాడారు.
జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంతో ఇంద్రజ చాలా మిస్సయ్యానని ఎమోషనల్ అయింది. `ఎక్స్ ట్రాజబర్దస్త్` షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంపై కెవ్వు కార్తీక్ ఓ స్కిట్ చేశాడు. "సుధీర్ లా కార్తీక్ కళ్లద్దాలు పెట్టుకునే టైమ్ లో ఒక్కసారిగా ఏడ్చేశాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. సుధీర్ ను నేను సిద్ధూ అని పిలుస్తా. చాలా మిస్ అయ్యా. నన్ను ప్రేమగా రాజీ అని సుధీర్ పిలుస్తాడు. అతను అమ్మ అని పిలవడం చాలా హ్యాపీగా వుంటుంది. అమ్మా అని పిలిపించుకోవడం చాలా ఇష్టం. జబర్దస్త్ నటుడు ప్రవీణ్ కూడా నాకు దేవుడు ఇచ్చిన కొడుకు. చాలా మంచి అబ్బాయి. అతనికి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చా.." అని తెలిపింది ఇంద్రజ.
తన పిల్లల పెళ్లి విషయంలో తాను ఇన్వాల్వ్ కాబోనని చెప్పుకొచ్చారు ఇంద్రజ. పెళ్లి విషయం పూర్తిగా వాళ్ల పర్సనల్ అని అన్నారు. పెళ్లికి ముందే ఆరేళ్ల పాటు మా ఆయనతో నాకు మంచి పరిచయం వుండేదని, తన గురించి అన్నీ తెలుసుకున్నాకే వివాహం చేసుకున్నామని తెలిపింది. తన భర్త తమిళంలో పలు సీనియల్స్ లో నటించారని, కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ కూడా రాశారని చెప్పారు. తామిద్దరం ఎప్పుడూ కలిసి పని చేయలేదని తెలిపారు.