ఆర్య మాస్టర్ ప్లాన్కు అడ్డంగా బుక్కైన రాగసుధ!
on Jun 30, 2022
'బొమ్మరిల్లు' ఫేమ్ శ్రీరామ్ వెంకట్ నటించి నిర్మించిన సీరియల్ `ప్రేమ ఎంత మధురం`. బుల్లితెరపై జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ గత కొంత కాలంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా సాగుతోంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికర మలుపులతో ఈ సీరియల్ ని రూపొందించారు. తాజాగా ఈ సీరియల్ చివరి అంకానికి వచ్చేసింది. క్లైమాక్స్ చేరుకుంది. ఇందులో శ్రీరామ్ వెంకట్ కు జోడీగా వర్ష హెచ్.కె. నటించగా ఇతర పాత్రల్లో జయలలిత, రామ్ జగన్, జ్యోతి రెడ్డి, విశ్వమోహన్, బెంగళూరు పద్మ, రాధాకృష్ణ, ఉమాదేవి తదితరులు నటించారు.
రాగసుధ ఎలాగైతే తమని మోసం చేసిందో అలాగే ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టాలని ఆర్యవర్ధన్ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ని అను చేత అమలు చేయిస్తాడు. ఆర్య చెప్పిన ప్లాన్ ప్రకారం రాగసుధ గెటప్ ని మాన్సీ తల్లికి వేయించి అను ఓ వీడియో షూట్ చేయిస్తుంది. రాజనందిని గదిలో తనతో పాటే వున్న రాగసుధ ఆమెను నమ్మించి ఆస్తి పత్రాలని ఎలా కొట్టేసిందో కళ్లకు కట్టినట్టుగా షూట్ చేయిస్తుంది. దాన్నే ఆధారంగా చేసుకుని కోర్టులో సబ్మిట్ చేస్తుంది.
ఇక అక్కడి నుంచి ఆర్య తరుపు వాదిస్తున్న లాయర్ ఆట మొదలు పెడతాడు. అను షూట్ చేయించి తెచ్చిన వీడియో వున్న పెన్ డ్రైవ్ ని జడ్జికి సమర్పిస్తాడు. అదే వీడియోను కోర్టులో ప్రదర్శిస్తారు. వీడియో చూసిన జడ్జి, రాగసుధ తరుపున వాదిస్తున్న లాయర్, రాగసుధ ఒక్కసారిగా షాక్ కు గురవుతారు. ఇదే అదనుగా ఆర్యవర్ధన్ లాయర్ రాగసుధకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఊపిరి ఆడకుండా చేస్తాడు.
"కేవలం డబ్బు వ్యామోహంతోనే ఇప్పుడు అనురాధ గారిని ఎలా కత్తితో పొడిచి చంపాలనుకున్నారో.. అప్పుడు రాజనందిని గారిని కూడా కత్తితో కిరాతకంగా కర్కశంగా పొడిచి చంపారు" అని నిలదీస్తాడు.. అయితే రాగసుధ లేదు అని బుకాయిస్తుంది... అయినా సరే కత్తితో పొడిచి పొడిచి చంపారని లాయర్ రెట్టిస్తాడు.. దీంతో టంగ్ స్లిప్పయిన రాగసుధ పొడవలేదని, నెట్టేశానని నిజం చెప్పేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? రాగసుధ జైలుకి వెళ్లిందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.