అప్పుడు కాజల్.. ఇప్పుడు శ్రుతి హాసన్..!
on Jun 25, 2022
అటు రామ్ చరణ్ తోనూ, ఇటు చిరంజీవితోనూ విజయాలు అందుకున్న కథానాయికల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. చరణ్ కి జోడీగా `మగధీర`, `నాయక్`, `గోవిందుడు అందరివాడేలే` చిత్రాల్లో సందడి చేసిన కాజల్.. చిరుకి జతగా `ఖైదీ నంబర్ 150`లో ఎంటర్టైన్ చేసింది. వీటిలో చరణ్ `నాయక్`, చిరు `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి సీజన్ లో వినోదాలు పంచిన సినిమాలు కావడం విశేషం. అంటే.. కొణిదెల కాంపౌండ్ తండ్రీతనయులతో కాజల్ పొంగల్ హిట్స్ సొంతం చేసుకుందన్నమాట.
ఇదిలా ఉంటే.. కాజల్ తరహాలోనే ఇప్పుడు శ్రుతి హాసన్ కూడా అదే బాటలో పయనించబోతోంది. ఆ వివరాల్లోకి వెళితే.. ఆ మధ్య రామ్ చరణ్ కి జంటగా `ఎవడు` చిత్రంలో నటించింది శ్రుతి. 2014 సంక్రాంతి స్పెషల్ గా రిలీజైన సదరు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. కట్ చేస్తే.. ఇప్పుడు చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సరసన `మెగా 154`లో నటిస్తోంది శ్రుతి హాసన్. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్.. 2023 పొంగల్ స్పెషల్ గా విడుదల కానుంది. మరి.. చరణ్ కాంబోలో సంక్రాంతి హిట్ అందుకున్న శ్రుతి.. తొమ్మిదేళ్ళ అనంతరం చిరు కాంబినేషన్ లోనూ పొంగల్ సక్సెస్ సొంతం చేసుకుంటుందేమో చూడాలి.