'ఆర్ఆర్ఆర్'కు ముందనుకున్న కాంబినేషన్ ఇది కాదు!
on Aug 3, 2021
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బాహుబలి తర్వాత ఇద్దరు స్టార్స్ తో కలిసి రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో 'ఆర్ఆర్ఆర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ భారీ మల్టీస్టారర్ కు ముందుగా అనుకున్న కాంబినేషన్స్ వేరట. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ స్వయంగా వెల్లడించారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ 'ఆర్ఆర్ఆర్' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇద్దరు హీరోలతో ఓ బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రం చేయాలని రాజమౌళి అనుకున్నాడు. రజనీకాంత్-ఎన్టీఆర్, అల్లు అర్జున్-ఎన్టీఆర్, కార్తి-సూర్య, కార్తి-బన్నీ ఇలా రకరకాల కాంబినేషన్ల గురించి ఆలోచించి చివరికి తారక్-చరణ్ లతో ఈ సినిమా చేశాడు. అయితే ఇలా కాంబినేషన్ గురించి ఆలోచిస్తున్నపుడే ఓసారి రాజమౌళి ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. అల్లూరి సీతారామరాజు పోరాటయోధుడిగా మారడానికి ముందు ఓ రెండేళ్లపాటు ఎక్కడికో వెళ్లిపోయారు. మరోవైపు అల్లూరి వెళ్లిన సమయంలోనే కొమురంభీమ్ కూడా కొంతకాలంపాటు ఎక్కడికో వెళ్లారు. ఈ విషయాన్ని చెప్పిన అనంతరం.. 'నాన్నా వీళ్లిద్దరూ ఒకే సమయంలో కొంతకాలంపాటు కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ఒకవేళ వాళ్లిద్దరూ పరస్పరం తారసపడితే ఎలా ఉంటుంది?' అని అడిగాడు. అలా 'ఆర్ఆర్ఆర్' కథ ప్రారంభమైంది" అని విజయేంద్రప్రసాద్ వివరించారు.
'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురంభీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఇందులో ఆలియాభట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read