కృష్ణ, విజయనిర్మల పెళ్లిని ముందే ఊహించిన రాజబాబు!
on May 5, 2021
కృష్ణ, విజయనిర్మల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? అదివరకే వేర్వేరు వ్యక్తులతో పెళ్లయి పిల్లలున్న ఆ ఇద్దరూ రెండో వివాహం చేసుకొని ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు తెలుగువారందరినీ షాక్కు గురిచేశారు. వివాహానంతరం ఇద్దరూ కలిసి అనేక సినిమాల్లో జంటగా నటించారు. అయితే ఆ ఇద్దరి వివాహాన్ని ముందుగా ఊహించిన వ్యక్తి ఒకరున్నారు.. ఆయన అప్పటి టాప్ కమెడియన్ రాజబాబు. కృష్ణతో మీ పెళ్లి జరుగుతుందని స్వయంగా విజయనిర్మలతో ఆయనే చెప్పారు. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు విజయనిర్మల.
కృష్ణ, విజయనిర్మల కలిసి నటించిన తొలి చిత్రం 'సాక్షి'. ఆ సినిమాకు బాపు దర్శకుడు. ఆ సినిమా ఆఫీసులో ఫస్ట్ టైమ్ తాను కృష్ణగారిని చూశానని విజయనిర్మల చెప్పారు. ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె, "బాపుగారే కృష్ణగారికి నన్ను పరిచయం చేశారు. 'ఈమె విజయనిర్మల. తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్గా చేస్తోంది. తెలుగమ్మాయే. మన సినిమాలో హీరోయిన్గా బుక్ చేస్తున్నాం.' అని చెప్పారు. అలా మాకు పరిచయం జరిగింది." అని విజయనిర్మల వెల్లడించారు.
'సాక్షి' సినిమా క్లైమాక్స్లో కృష్ణతో విజయనిర్మల తాళి కట్టించుకొనే సీన్ ఉంది. అందులో కృష్ణ మీసాలు ఉంచుకొనే కృష్ణుడి వేషం వేస్తారు. ఆ సీన్ చేశాక రాజబాబు, 'ఈ సినిమాలో నీకుండేది మీసాల కృష్ణుడు. ఈయనేమో కృష్ణ. కాబట్టి మీ ఇద్దరూ చాలా తొందరలో పెళ్లి చేసుకుంటారు.' అనేశారు. ఆయన అన్నట్లుగానే ఆ తర్వాత రెండు నెలలకే మేం తిరుపతి వెళ్లిపోయి, దేవుడి సన్నిధిలో అక్కడ పెళ్లి చేసుకున్నాం." అని ఆమె చెప్పారు.
పెళ్లయిన వెంటనే 'అమ్మకోసం' సినిమా షూటింగ్లో పాల్గొన్నారు కృష్ణ, విజయనిర్మల. "ఆ సినిమాలో మేం జంటగా నటించాం. కృష్ణగారి మదర్ అంజలీదేవి. నాగయ్యగారు సెట్లో ఉన్నారు. ఆయన నన్నుచూసి, 'చాలా కామ్గా ఉంటారు నువ్వు, ఆ అబ్బాయి.. ఇలా చేశారేంటి? మేం దిగ్భ్రాంతి చెందాం' అన్నారు." అని చెప్పుకొచ్చారు విజయనిర్మల. 75 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఆమె 2019 జూన్ 27న మృతి చెందారు.
Also Read