ఈసారి తప్పకుండా థియేటర్లలో వినోదం పంచుతా: వెంకటేష్
on Jul 30, 2021
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో డైరెక్ట్రర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం నారప్ప. జూలై 2న నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా వెంకటేష్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఈసారి తప్పకుండా మరో చిత్రంతో థియేటర్లలో వినోదం పంచుతానని చెప్పారు.
సక్సెస్ మీట్ లో వెంకటేష్ మాట్లాడుతూ.. నారప్పని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. కెరీర్ లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రలు పోషించినా.. ఎప్పుడూ ఏ పాత్రలో ఇంతగా లీనమవని తాను.. నారప్పతో బాగా కనెక్ట్ అయ్యానని తెలిపారు. నారప్ప చిత్రం కొత్త అనుభూతిని పంచిందన్నారు. థియేటర్లలో విడుదల చేయలేదనే బాధలో ఉన్నా.. అభిమానులు ఆదరించారని తెలిపారు. ఈసారి తప్పకుండా మరో చిత్రంతో థియేటర్లలో వినోదం పంచుతానని పేర్కొన్నారు. వెంకటేష్ నటించిన మరో చిత్రం 'దృశ్యం2'కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో.. వెంకటేష్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దృశ్యం2 ను థియేటర్స్ లోనే విడుదల చేసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నారప్ప సక్సెస్ మీట్ లో ప్రియమణి, శ్రీకాంత్ అడ్డాల, సురేష్ బాబు, కార్తీక్ రత్నం తదితరులు పాల్గొని ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు.