
- మలయాళంలో మరో సెన్సేషన్
- వంద కోట్ల క్లబ్లో ‘వాళా 2’
- 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డ్!
తక్కువ బడ్జెట్ సినిమాలతో వచ్చి, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టడం మలయాళ సినీ పరిశ్రమకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆ జాబితాలోకి ‘వాళా 2: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రోస్’ (Vaazha 2: Biopic of a Billion Bros) వచ్చి చేరింది. విడుదలైన కేవలం ఏడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ‘వాళా 2’ నిలిచింది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు రూ. 103.52 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇందులో ఇండియా కలెక్షన్స్ రూ. 54.62 కోట్ల గ్రాస్ కాగా, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ చిత్రం సత్తా చాటుతూ రూ.48.90 కోట్లను కొల్లగొట్టింది.
సాధారణంగా సీక్వెల్ సినిమాలపై భారీ అంచనాలు ఉండి, అవి బాక్సాఫీస్ వద్ద చతికిలపడటం చూస్తుంటాం. కానీ, ‘వాళా 2’ ఆ నెగటివ్ సెంటిమెంట్ను చెరిపేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.
దర్శకుడు సవిన్ ఎస్.ఏ (Savin S.A) తెరకెక్కించిన ఈ చిత్రం, నలుగురు స్నేహితుల జీవిత ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, యువతకు బాగా కనెక్ట్ అయ్యింది. సమాజంలో ‘లూజర్స్’ అని ముద్ర పడిన నలుగురు యువకులు, తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు? వారి మధ్య ఉండే స్నేహం, అనుబంధం ఏంటి? అనే అంశాలను కామెడీతో పాటు ఎమోషనల్ కోణంలో దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు.

గతంలో 2024లో వచ్చిన ‘వాళా: బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బాయ్స్’ ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. దానికి ఇది స్పిరిచువల్ సీక్వెల్గా వచ్చినప్పటికీ.. కథనం, పాత్రల విషయంలో సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా నేటి తరం విద్యార్థుల యూకే కలలు, తల్లిదండ్రుల ఒత్తిడి వంటి అంశాలను రియలిస్టిక్గా చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంకిత్ మీనన్ అందించిన సంగీతం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. మలయాళ ఆడియన్స్తో పాటు ఇతర భాషల వారు కూడా ఈ సినిమా గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ‘వాళా 2’కు బాగా కలిసి వచ్చింది. సెకండ్ వీక్లో కూడా ఇదే జోరు కొనసాగితే, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
రూ.120 కోట్లతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళ సినిమాగా ప్రస్తుతం 'ఆడు-3' టాప్ లో ఉంది. ‘వాళా 2’ జోరు చూస్తుంటే త్వరలోనే 'ఆడు-3'ని వెనక్కి నెట్టి, టాప్ ప్లేస్ లోకి వచ్చేలా ఉంది.





