చిరు, చరణ్తో యూవీ క్రియేషన్స్?
on Sep 17, 2021
`మిర్చి`(2013) చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన యూవీ క్రియేషన్స్.. అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ టాప్ ప్రొడక్షన్ హౌస్ `రాధే శ్యామ్`ని నిర్మిస్తోంది. చిత్రీకరణ చివర దశకు చేరుకున్న ఈ పిరియడ్ లవ్ సాగా.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లోకి రానుంది.
ఇదిలా ఉంటే.. యూవీ క్రియేషన్స్ త్వరలో ఓ `మెగా` ప్రాజెక్ట్ ని నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించే అవకాశముందని వినికిడి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు పూర్తయ్యాయని.. 2022 చివరలో ఈ భారీ బడ్జెట్ మూవీ పట్టాలెక్కే అవకాశముందని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, చిరు - చరణ్ ఇప్పటికే `మగధీర` (2009), `బ్రూస్ లీ` (2015), `ఖైదీ నంబర్ 150` (2017) చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మొదటి రెండు సినిమాల్లో చిరు అతిథిగా కనిపించగా.. మూడో చిత్రంలో చరణ్ ఓ పాటలో తళుక్కుమన్నారు. ఇక చిత్రీకరణ తుది దశకు చేరుకున్న `ఆచార్య`లో మాత్రం వీరిద్దరూ పలు సన్నివేశాల్లో మెగాభిమానులను ఎంటర్టైన్ చేయబోతున్నారు.