
- ఒకేరోజు విడుదలైన భార్యాభర్తల సినిమాలు
- శరత్కుమార్ పై రాధిక పైచేయి
- బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న 'తాయ్ కిళవి'
- 10 రోజుల్లోనే 50 కోట్లు
కొన్ని బాక్సాఫీస్ క్లాష్ లు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా బాక్సాఫీస్ బరిలో దిగడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఇటీవల తమిళనాట అలాంటి అరుదైన క్లాష్ జరిగింది. భార్యాభర్తలు బాక్సాఫీస్ వార్ కి దిగారు. ఈ పోరులో భార్య పైచేయి సాధించడం విశేషం.
ఆర్. శరత్కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆళి'(Aazhi), రాధికా శరత్కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 'తాయ్ కిళవి'(Thaai Kizhavi) ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫిబ్రవరి 27న ఈ రెండు సినిమాలు థియేటర్లలో అడుగుపెట్టాయి. 'ఆళి' పెద్దగా ప్రభావం చూపించడం లేదు కానీ.. 'తాయ్ కిళవి' మాత్రం భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.
థియేటర్లలో భారీ సినిమాలు మాత్రమే చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు. చిన్న సినిమాలు, అందునా ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ చూడరనే అభిప్రాయముంది. దానిని పటాపంచలు చేసింది 'తాయ్ కిళవి'. కంటెంట్ ఉంటే కాసులు కురుస్తాయని మరోసారి నిరూపించింది.

కథ ఏంటంటే..
పవునుత్తాయి(రాధిక) అనే ఒక వృద్ధురాలు వడ్డీ వ్యాపారం చేస్తూ ఊళ్ళో దర్జాగా జీవిస్తూ ఉంటుంది. అయితే అకస్మాత్తుగా పక్షవాతంతో మంచాన పడుతుంది. ఆమె చనిపోతే ఆస్తి పంచుకోవచ్చని కొడుకులు మొదట భావిస్తారు. కానీ, ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే విషయం వారికి తెలుస్తుంది. ఆ బంగారం ఎక్కడ దాచిందో తెలుసుకోవడం కోసం, ఆమెను బతికించుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతారు. అసలు ఆ బంగారం రహస్యం ఏంటి? స్వార్థపరులైన కొడుకులు తమ తప్పు తెలుసుకున్నారా? పవునుత్తాయి తన కుటుంబానికి, ఊరి మహిళలకు ఏం చెప్పాలనుకుంది? అనేదే మిగతా కథ.
కథ చిన్నదే అయినప్పటికీ.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ, ఎమోషన్స్ తో కథను నడిపించిన తీరు ఆకట్టుకుంది. కుటుంబ బాంధవ్యాల విలువను తెలియజేయడంతో పాటు, మహిళకు మంచి సందేశాన్ని ఇచ్చింది ఈ చిత్రం.
ప్రస్తుతం తమిళ బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాలు లేకపోవడం, ఈ సినిమాకి పాజిటివ్ టాక్ టాక్ రావడంతో 'తాయ్ కిళవి' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం పది రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇతర భాషల్లోనూ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇదే జోరు కొనసాగితే ఫుల్ రన్ లో రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యం లేదు.
కాగా, ఈ చిత్రానికి శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించగా, ప్రముఖ హీరో శివ కార్తికేయన్ నిర్మించడం విశేషం.
Also Read: మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ 'పోచమ్మ'.. మరో కాంతార అవుతుందా?







