
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన, హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన భావోద్వేగ కథనంతో రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ట్రైలర్లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను పరిచయం చేశారు. నలభై ఏళ్ల వయస్సు దాటినా తన కలలను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిగా సూర్య కనిపించారు. స్టైల్, హాస్యం, ప్రేమ, భావోద్వేగాలను అద్భుతంగా మేళవిస్తూ ఆయన మరోసారి తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెంకీ అట్లూరి హృదయానికి హత్తుకునే రచనతో కలిసి సూర్య కెరీర్లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగిస్తోంది.
"మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక" వంటి డైలాగ్ లు ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. అలాగే ట్రైలర్ చివరిలో "ఇప్పుడెందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావ్" అంటూ సూర్యతో మమితా బైజు చెప్పే డైలాగ్ నవ్వులు పూయించింది.
హీరోయిన్ మమితా బైజు తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, రాధికా శరత్కుమార్, రవీనా టాండన్ తో పాటు ఇతర ప్రముఖ నటీనటులు ఈ కుటుంబ కథకు మరింత బలం చేకూర్చారు.
జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన హృద్యమైన సంగీతం, నిమిష్ రవి అందించిన అద్భుతమైన ఛాయాగ్రహణం, వెంకీ అట్లూరి తనదైన శైలిలో చెప్పిన భావోద్వేగ కథనం ట్రైలర్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి.
ఇటీవల కోయంబత్తూరులో ఘనంగా నిర్వహించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందం ఈ సినిమా భావోద్వేగాల పరంగా ప్రతి వయసు ప్రేక్షకుడిని అలరిస్తుందని ఎంతో నమ్మకంగా చెప్పింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ నమ్మకాన్ని పూర్తిగా నిజం చేస్తూ, థియేటర్లలో ఓ అద్భుతమైన అనుభూతిని అందించబోతుందనే అంచనాలను మరింత పెంచింది.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది.
Vishwanath and Sons Trailer, Suriya, Venky Atluri, Mamitha Baiju






