చిక్కుల్లో సోనూసూద్.. రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేత!
on Sep 18, 2021
ప్రముఖ నటుడు సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడోరోజుల పాటు సోదాలు చేసిన ఐటీ అధికారులు.. దాడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సోనూసూద్ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్టు ఆధారాలు సేకరించినట్టు తెలిపారు.
మూడు రోజుల పాటు ముంబై, లక్నో, జైపూర్ లలో ఏకకాలంలో 28 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోనూసూద్ కు సంబంధించిన వ్యక్తుల ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు చేశారు. సోనూసూద్ వ్యక్తిగత ఖాతాలతో పాటు, ఆయన ఛారిటీకి చెందిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. 11 లాకర్లను గుర్తించిన అధికారులు.. కోటీ 8లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సోనూసూద్ తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా రూ.18 కోట్లకు పైగా ఫౌండ్స్ సేకరించారు. అయితే, అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు ఖర్చు పెట్టారని అధికారులు గుర్తించారు. మిగిలిన డబ్బు ఛారిటీ ఖాతాలో అలాగే ఉండిపోయినట్లు తెలుస్తోంది.
ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా విదేశాల నుంచి సోనూసూద్ స్వచ్ఛంద సంస్థ రూ.2.1 కోట్ల నిధులను సమీకరించిందని అధికారులు చెప్పారు. లెక్కలో చూపించని ఆదాయాన్ని దారి మళ్లించేందుకు బోగస్ సంస్థల నుంచి రుణాలను తీసుకున్నట్టు చూపించారని ఆరోపించారు. కాగా ఇటీవల సోనూసూద్ కంపెనీకి, లక్నోలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య జరిగిన డీల్ కు సంబంధించి సోనూసూద్ పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలతో అధికారులు సోదాలు చేశారు.