పవన్ కళ్యాణ్ ను సినీ పెద్దలే గుదిబండగా భావిస్తున్నారు!
on Sep 28, 2021
'రిపబ్లిక్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల కాక ఇంకా చల్లార లేదు. సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయం విషయంలో జగన్ సర్కార్ పై పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పవన్ పై విరుచుకుపడ్డారు.
పవన్ కళ్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే పవన్ కే ఇబ్బంది అని.. ఆయన ఇండస్ట్రీకి పెద్ద గుదిబండ అని సినీ పెద్దలే భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ఇండస్ట్రీలో అందరూ కోరుకుంటున్నారని.. బ్లాక్లో టికెట్లు అమ్ముకుని, దొంగ లెక్కలతో లబ్ధిపొందుతున్న కొద్ది మందే ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సినిమాలతో వచ్చిన ఆదాయం అంతా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు వెళ్లడం లేదని.. ఆన్లైన్ వస్తే అలాంటి మెసాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో ప్రభుత్వానిది సహకార పాత్ర మాత్రమే అన్నారు. ఆన్లైన్ టికెటింగ్ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకే వెళ్తుందని.. దీనిపై వారం పది రోజుల్లో విధి విధానాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
అలాగే, ప్రభుత్వం మటన్ షాపులు పెడుతోందన్న ప్రచారంలో నిజం లేదని.. షాపుల్లో శుభ్రత పెంచేందుకు ఆలోచిస్తున్నామని సజ్జల చెప్పుకొచ్చారు. ఏ అంశాలు లేనందువల్లే ఏదో ఒక విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల అన్నారు.