
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. ఇప్పుడు ఆ అంచనాలు రెట్టింపు అయ్యే న్యూస్ వినిపిస్తోంది. ‘పెద్ది’ ప్రమోషన్స్ కోసం లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni) రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా సినిమాల ప్రమోషన్లు హైదరాబాద్ లేదా చెన్నై వంటి నగరాల నుండి మొదలవుతాయి. కానీ, ‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ టీమ్ జార్ఖండ్ రాజధాని రాంచీని ఎంచుకున్నట్లు సమాచారం. అక్కడ ఒక భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారట. ధోని సొంత ఊరు రాంచీ కావడంతో, అక్కడ జరిగే ఈ భారీ ఈవెంట్ కు ఆయనను చీఫ్ గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నాల్లో ‘పెద్ది’ టీమ్ ఉందట. ఈ సినిమాలో రామ్ చరణ్ క్రికెటర్ గా కూడా కనిపించనున్నాడు. అందుకే ధోని గెస్ట్ గా వస్తే బాగుంటుందని మేకర్స్ ఆలోచనట. అన్నీ అనుకున్నట్టు కుదిరి ‘పెద్ది’ ఈవెంట్ కి ధోని హాజరైతే హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు.
రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కి ధోని విపరీతమైన ఫాలోయింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. రాంచీ ఈవెంట్తో మొదలయ్యే ఈ ప్రమోషన్లు ‘పెద్ది’ సినిమాను ఏ రేంజ్కు తీసుకెళ్తాయో చూడాలి. త్వరలోనే ఈ ఈవెంట్పై క్లారిటీ వచ్చే అవకాశముంది.






