
ఎంతటి స్టార్ డమ్ ఉన్నా, ఎంతటి ప్రజాదరణ ఉన్నా.. ఈ డిజిటల్ యుగంలో సెలబ్రిటీలపై వచ్చే ట్రోల్స్, నెగెటివిటీని ఎవరూ తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన అప్కమింగ్ మూవీ 'ధర్మన్' (Dharaman) టైటిల్ లాంచ్ ఈవెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వేదికపై ఆయన మాట్లాడిన మాటలు కేవలం సినిమా గురించే కాకుండా, ఆయన వ్యక్తిగత జీవితం మరియు సమాజంలో ఉన్న నెగెటివిటీపై ఆయనకున్న స్పష్టమైన అవగాహనను తెలియజేస్తున్నాయి.
"నేను మాట్లాడటం మొదలుపెడితే చాలు, అది ఏదో ఒక కొత్త సమస్యను సృష్టిస్తుంది. నా గురించి నిరంతరం గాసిప్స్ రాయడం, మాట్లాడుకోవడం మొదలుపెడతారు. సరే కదా అని నేను మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే.. అసలు రజనీకాంత్ ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటూ రకరకాల ప్రశ్నలు వేస్తారు. మళ్లీ నేను ఏదైనా విషయంపై స్పందించి మాట్లాడితే, నేను అలా మాట్లాడి ఉండకూడదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలుపెడతారు" అంటూ రజనీకాంత్ తన ఆవేదనను పంచుకున్నారు.
"నాకు ఇప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. మనల్ని ద్వేషించే వాళ్లు (హేటర్స్) ఎప్పుడూ మనపై ద్వేషాన్ని మాత్రమే చల్లుతూ ఉంటారు. వాళ్లు ఎప్పటికీ మారరు, నెగెటివిటీని వ్యాప్తి చేయడమే వారి పని. అలాగే మనల్ని అమితంగా ప్రేమించే మన వాళ్లు, అభిమానులు ఎల్లప్పుడూ మనపై ప్రేమను మాత్రమే కురిపిస్తారు. అందుకే మనం ఎవరి మాటలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి" అని తలైవా చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టినప్పుడు రజినీకాంత్ స్పందనపై రకరకాల కామెంట్స్ వచ్చాయి. దానిని దృష్టిలో పెట్టుకునే రజినీకాంత్ తాజా వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






