
ఇటీవల ఓ కార్యక్రమంలో తమిళ సినీ దిగ్గజం ఎంజీఆర్ పై సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నటులు నాజర్, విశాల్ సహా పలువురు దీనిని తప్పుబట్టారు. వివాదం మరింత ముదురుతుండటంతో తాజాగా రాజేంద్రప్రసాద్ క్షమాపణలు చెప్పారు.
రీసెంట్ గా కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ అవార్డుని రాజేంద్రప్రసాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా కాంతారావుపై ప్రశంసలు కురిపించే క్రమంలో.. ఎంజీఆర్ ని తక్కువ చేసి మాట్లాడారు రాజేంద్రప్రసాద్. కాంతారావుని చూసి అప్పట్లో ఎంజీఆర్ ఉ** పోసుకున్నాడని అన్నారు.
ఎంజీఆర్ పై రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తమిళ ప్రజలు, ఎంజీఆర్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నాజర్, విశాల్ సహా పలువురు సినీ ప్రముఖులు రాజేంద్రప్రసాద్ తీరుని తప్పుబట్టారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా తమిళ భాషలో క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు రాజేంద్రప్రసాద్. తనకు ఎంజీఆర్ అంటే ఎంతో గౌరవమని, ఆయనను తాను స్ఫూర్తిగా తీసుకుంటానని పేర్కొన్నారు. అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కాదని, ప్రసంగంలో భాగంగా తెలియక చేసిన వ్యాఖ్యలని వివరించారు.
"నా మాటల వల్ల తమిళ సోదరులు, ఎంజీఆర్ అభిమానులు బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అని రాజేంద్రప్రసాద్ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read: జియో హాట్స్టార్ లో విజయ్ సేతుపతి సంచలన వెబ్ సిరీస్







