ఉరేసుకొని రాజన్ పి. దేవ్ కోడలి మృతి.. భర్త వేధింపులే కారణమా?
on May 15, 2021
దివంగత ప్రముఖ నటుడు రాజన్ పి. దేవ్ కోడలు ప్రియాంక బుధవారం ఉరివేసుకొని మృతి చెందడం సంచలనం సృష్టించింది. ఆమె మృతిపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రాజన్ పి. దేవ్ కుమారుడు, నటుడు ఉన్ని పి. దేవ్, ప్రియాంక పెళ్లి 2019 నవంబర్ 21న జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేకనే ప్రియాంక చనిపోయిందంటూ ఆమె కుటుంబం ఆరోపిస్తోంది.
కేరళలోని తిరువనంతపురమ్కు చెందిన ప్రియాంక వెంబయమ్లోని తమ నివాసంలో బుధవారం 2 గంటలకు ఉరివేసుకొని ఉండగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఉన్ని పి. దేవ్ తన సోదరిపై వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ప్రియాంక సోదరుడు గృహ హింస కేసు పెట్టారు. వివాహం జరిగిన కొన్నాళ్ల నుంచీ ఉన్ని, ప్రియాంక మధ్య కీచులాటలు మొదలయ్యాయి. అతడి వేధింపులు తట్టుకోలేక ప్రియాంక తన పుట్టింటికి వచ్చేసిందని సమాచారం. ఉన్ని ఆగడాలు మొదట్లో తమకు తెలిసేవి కాదని, అయితే పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో అతడి నిజ స్వరూపం బయటడిందని, అంతేకాకుండా తమ కూతురిని శారీరకంగా హింసించేవాడని కుటుంబసభ్యులు అంటున్నారు. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసుకున్న తిరువనంతపురమ్లోని వట్టపర పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తండ్రి రాజన్ పి. దేవ్కు వారసుడిగా సినిమాల్లోకి నటుడిగా అడుగుపెట్టిన ఉన్ని ఇడి, రాక్షాధికారి బైజు, ఆడు 2, మందరమ్, జనమైత్రి, సచిన్ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించడం ద్వారా ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. 'ఆడు ఒరు భీకర జీవియను' సినిమాలో చేసిన క్యారెక్టర్ అతడికి మంచి పేరు తెచ్చింది.
ఇక రాజన్ పి. దేవ్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. ఖుషి, ఆది, దిల్, ఒక్కడు, గుడుంబా శంకర్, బన్నీ, యోగి, కృష్ణ తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. కాలేయ వ్యాధితో బాధపడుతూ 2009 జూలైలో ఆయన మరణించారు.
Also Read