లెజెండరీ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ ఇక లేరు!
on Sep 21, 2021
తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి పబ్లిసిటీ డిజైనర్గా మూడు దశాబ్దాలకు పైగా రాణించిన ఈశ్వర్ మంగళవారం (సెప్టెంబర్ 21) తెల్లవారు జామున నాలుగు గంటలకు చెన్నైలో కన్నుమూశారు. చెన్నైలోని విజయా హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కొసనా ఈశ్వరరావు. వయసు 84 సంవత్సరాలు. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు.
భారతదేశపు సినీ ప్రముఖులందరితో కలిసి పనిచేసిన వైభవం ఈశ్వర్ది. బాపు దర్శకునిగా పరిచయమైన 'సాక్షి' (1967) సినిమాతో పబ్లిసిటీ డిజైనర్గా ఈశ్వర్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలుగలేదు. సుమారు 40 ఏళ్ల పాటు నిర్విరామంగా పనిచేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ,హిందీ భాషల్లో 2600లకు పైగా చిత్రాలకు పని చేశారు. విజయా, ఏవీయం, జెమినీ, అన్నపూర్ణ, సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, గీతా ఆర్ట్స్ తదితర అగ్ర నిర్మాణ సంస్థలకు ఆయన పబ్లిసిటీ డిజైనర్గా పని చేశారు. పలు ప్రముఖ నిర్మాణ సంస్థల లోగోలను ఆయన డిజైన్ చేశారు. ఆయన చివరి చిత్రం 'దేవుళ్లు' (2000).
ఆయన బిజీగా ఉన్నరోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, స్వయంగా ఈశ్వర్ గారింటికి వెళ్ళారు, అణ్ణా చిత్రం వేయించుకోడానికి..! E - అన్న ఒక్క అక్షరం చాలు ఆయనెవరో తెలుసుకోడానికి..!
తను పనిచేసిన సినిమాలకు సంబంధించిన అనుభవాలను రంగరిస్తూ, పలు పబ్లిసిటీ డిజైన్లను సోదాహరణంగా వివరిస్తూ ఈశ్వర్ రాసిన 'సినిమా పోస్టర్' పుస్తకానికి ఉత్తమ సినిమా గ్రంథ రచన విభాగంలో 2011లో నంది పురస్కారం లభించింది. చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2015లో ఆయనను రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. ఆయన భార్య పేరు వరలక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈశ్వర్ గీతల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణావతారం
ఈశ్వర్ ప్రచురించిన విలువైన పుస్తకం సినిమా పోస్టర్
Also Read