
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (SPIRIT). ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అఫీషియల్ బిజినెస్ అప్డేట్ బయటకు వచ్చి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం యొక్క కర్ణాటక థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory), ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ (Asian Suresh Entertainment) భాగస్వామ్యంతో సొంతం చేసుకున్నాయి.
ప్రభాస్ మార్కెట్కు కర్ణాటక అత్యంత బలమైన స్థానాల్లో ఒకటిగా పేరుగాంచింది. బాహుబలి, సలార్ వంటి చిత్రాలతో కర్ణాటక బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సాధించిన వసూళ్లు సరికొత్త చరిత్రను తిరగరాశాయి. అలాంటి బలమైన మార్కెట్లో ఈ క్రేజీ కాంబో చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు బిగ్ ప్లాన్ చేస్తున్నాయి. కర్ణాటకలోని మూలమూలనా ఉన్న సినీ అభిమానులకు, ప్రేక్షకులందరికీ ఒక మరువలేని థియేట్రికల్ అనుభూతిని అందించడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను, బెంచ్మార్క్లను క్రియేట్ చేస్తామని ఇరు నిర్మాణ సంస్థలు ఎంతో ధీమాతో వెల్లడించాయి.
ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీని టీ సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నారనే వార్తలతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలో విడుదల కాబోతోంది.
Prabhas, Sandeep Reddy Vanga, Spirit, Karnataka Distribution, People Media Factory






