.webp)
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ 'ఫౌజీ'. ఈ చిత్రంపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. ఫ్యాన్స్ అయితే రిలీజ్ డేట్ డిసెంబర్ 3 కోసం ఇప్పట్నుంచే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పైగా ప్రభాస్ నుంచి అభూతకల్పనలతో కూడిన చిత్రాల తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ హార్ట్ డేట్ ఏ విధంగా కొట్టుకుంటూ ఉంటుందో కూడా అర్ధం చేసుకోవచ్చు .
విభిన్నమైన ప్రేమ కథలు, చారిత్రక నేపథ్యంతో ప్రేక్షకులను కట్టిపడేసే ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని అత్యంత విజువల్ గ్రాండియర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా బయటకు వచ్చిన ఓ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ రెబెల్ స్టార్ అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. సినిమాలోని అతిముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం చిత్రబృందం హైదరాబాద్ వేదికగా వేసిన చార్మినార్ సెట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
సాధారణంగా చార్మినార్ నేపథ్యంతో కూడిన సన్నివేశాలను చిత్రీకరించాల్సి వస్తే ఏ దర్శకుడైనా పాతబస్తీలోని అసలైన చార్మినార్ ప్రాంగణాన్నే ఎంచుకోవడం సహజం. అయితే 'ఫౌజీ ' చిత్రబృందం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన, అత్యంత బాధ్యతాయుతమైన వినూత్న నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి నుంచి లింగంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న పాత అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిజమైన చార్మినార్ని తలపించేలా ఒక భారీ సెట్ను ప్రత్యేకంగా నిర్మించింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, అద్భుతమైన కళా నైపుణ్యంతో నిజమైన కట్టడానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ప్రతిరూపాన్ని డిజైన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ రకమైన బారీ సెట్ నిర్మించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ప్రభాస్కు ఉన్న అపారమైన గ్లోబల్ స్టార్డమ్, లక్షలాది మంది అభిమానుల క్రేజ్ కారణంగా పాతబస్తీ లాంటి రద్దీ ప్రాంతంలో ప్రత్యక్షంగా షూటింగ్ జరపడం ఎంతో ప్రమాదకరంతో కూడుకున్న పని. ఒకవేళ అక్కడ షూటింగ్ నిర్వహిస్తే వేలాది మంది అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడమే కాకుండా, శాంతిభద్రతల పరంగా కూడా పెద్ద ఎత్తున భద్రతా ఇబ్బందులు ఎదురవుతాయని మేకర్స్ ముందే ఊహించారు. షూటింగ్కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు పూర్తి రక్షణ కల్పిస్తూ పనిని వేగవంతం చేయడానికే ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 3 నుంచి ఈ కొత్త షెడ్యూల్ అధికారికంగా ప్రారంభమైంది. గచ్చిబౌలిలో నిర్మించిన ఈ చార్మినార్ సెట్లో దాదాపు 25 రోజుల పాటు సుదీర్ఘంగా షూటింగ్ కొనసాగనుంది. ఈ 25 రోజుల కీలకమైన షెడ్యూల్లో ప్రభాస్పై అత్యంత ప్రాధాన్యత ఉన్న భారీ యాక్షన్ మరియు డ్రామా సన్నివేశాలను దర్శకుడు హను రాఘవపూడి చిత్రీకరించనున్నారు. ఈ దశ విజయవంతంగా పూర్తయితే, సినిమా మొత్తం చిత్రీకరణ దాదాపు 90 శాతం వరకు పూర్తయినట్లేనని ఫిలింనగర్ సమాచారం. ఆ తర్వాత మిగిలిన కొద్దిపాటి చిత్రీకరణను వేగంగా ముగించి, శరవేగంగా విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయాలని పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. గతంలో మహేష్ ఒక్కడు మూవీకి చార్మినార్ సెట్ వేసిన విషయం తెలిసిందే.
Prabhas, Fauji, Hanu Raghavapudi





