'ఆచార్య'కు 'శానా కష్టం' వచ్చింది.. కొరటాలపై పోలీసులకు ఫిర్యాదు!
on Jan 6, 2022
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'సిద్ధ' అనే కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు. ఫిబ్రవరి 4 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి 'శానా కష్టం' అనే సాంగ్ విడుదలైంది. ఆ సాంగే ఇప్పుడు ఆచార్యకి కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ సాంగ్లో లిరిక్స్ RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉన్నాయంటూ RMP సంఘం నాయకులు కొరటాల శివపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'శానా కష్టం' సాంగ్ లిరికల్ వీడియోకి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్ లో పలు సాంగ్స్ ఛాయలు కనిపిస్తున్నాయని విమర్శలు వచ్చినప్పటికీ యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ వస్తుండటం విశేషం. లిరికల్ వీడియోలో మెగాస్టార్ స్టెప్స్, రెజీనా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ కావడంతో యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని అంటున్నారు. అయితే ఈ సాంగ్ కి లిరిక్స్ అందించిన భాస్కరభట్ల ఒక లైన్ లో 'ఏడేడో నిమురోచ్చని కుర్రోళ్ళు ఆర్ఎంపీలు అవుతున్నారు' అని రాయడం వివాదానికి తెరదీసింది. ఈ సాంగ్లో లిరిక్స్ RMP వృత్తిని అవమానపర్చే విధంగా ఉన్నాయంటూ ఆ సంఘం నాయకులు జనగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాట రచయిత, సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. RMPల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్న ఆ పాటని తొలగించాలని RMP సంఘం నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ వివాదంపై ఆచార్య టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. గతంలోనూ పలు సినిమా పాటలపై ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాగా, అభ్యంతరకరమైన ఆ లైన్స్ తొలగించిన సందర్భాలు ఉన్నాయి.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్న ఆచార్య మూవీలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.
Also Read