
'పెద్ది'(Peddi)రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ తెలంగాణ రాష్ట్ర మెగా అభిమానుల్లో, ప్రేక్షకుల్లో నైజాం ఏరియాకి సంబంధించిన టికెట్ ధరల పెంపు అదనపు షోలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య నడుస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ వివాదాల వల్ల తెలంగాణ ప్రభుత్వం అసలు ఈ చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తుందా లేదా అనే సస్పెన్స్ చివరి నిమిషం వరకు కొనసాగింది. మైత్రీ మూవీస్ గతంలో నిర్మించిన కొన్ని చిత్రాలకి నైజాంలో అదనపు రేట్లు రాకపోవడంతో, 'పెద్ది' చిత్రానికి కూడా జీవో రావడం కష్టమేనని అందరూ భావించారు. కానీ చివరి గంటల్లో ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి పెద్దికి భారీ ఊరట లభించింది.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక జీవో ప్రకారం, 'పెద్ది' కి 10 రోజుల పాటు రోజుకి 5 షోల ప్రదర్శనకి అనుమతి లభించింది. ఈ రోజు జరగబోయే స్పెషల్ పెయిడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ రేటు 600 రూపాయలు ఉండేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్ లో ప్రతి టికెట్పై 100, మల్టీప్లెక్స్లలో జీఎస్టీతో కలిపి 125 వరకు అదనంగా పెంచుకునేందుకు అవకాశం కల్పించారు.
Also read: SJ Suryah: ఎస్జే సూర్య కిల్లర్ షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ కీలకమైన జీవోని రాబట్టడం వెనుక చక్రం తిప్పిన వ్యక్తి టాలీవుడ్ బడా నిర్మాత, షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి. ఎలాంటి హడావుడి లేకుండా, సైలెంట్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి, ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపి జీవో వచ్చేలా కీ రోల్ పోషించారు. గతంలో కూడా మనశంకర వరప్రసాద్, అఖండ 2 వంటి భారీ చిత్రాలకి నైజాం ఏరియాలో స్పెషల్ పర్మిషన్లు, అదనపు షోల అనుమతులు సాధించడంలోను సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ 'పెద్ది' సినిమా కోసం రంగంలోకి దిగి నైజాం బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడానికి మైత్రీ మూవీస్కి అండగా నిలబడటంతో సాహు గారపాటిపై టాలీవుడ్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, బాలకృష్ణ భగవంత్ కేసరికి సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.






