.webp)
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఊహించని భారీ సర్ ప్రైజ్ లభించింది. ఏపీ పాలనా వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్ కళ్యాణ్, ఇప్పట్లో కొత్త సినిమాలు అంగీకరించే అవకాశం లేదని అందరూ భావించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే పరిమితం అవుతారనే ప్రచారం కూడా గట్టిగా సాగింది. అయితే, వీటన్నింటికీ చెక్ పెడుతూ ఇటీవల 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' నుంచి వచ్చిన ఒకే ఒక్క అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన బ్లాక్బస్టర్ హిట్ 'ఓజీ' చిత్రానికి సీక్వెల్గా 'ఓజీ 2' (OG 2) రాబోతోందనే వార్త మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. థియేటర్లలో రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన 'ఓజీ' విజయంతో, ఈ సీక్వెల్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ ఏడాది నవంబర్లోనే 'ఓజీ 2' చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి, సినిమాను లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్స్పైనే ఆధారపడి ఉంది. దర్శకుడు సుజీత్ ఇప్పటికే పవన్ కళ్యాణ్తో 'ఓజీ' షూటింగ్ సమయంలోనే ఈ సీక్వెల్ స్క్రిప్ట్కు సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నవంబర్ నుంచి డేట్స్ కేటాయిస్తే, సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్ను పక్కన పెట్టి మరీ 'ఓజీ 2' సెట్స్పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
నిజానికి సుజీత్, హీరో నానితో 'బ్లడీ రోమియో' అనే సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే నాని ప్రస్తుతం 'ది ప్యారడైజ్'తో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే ఆలస్యమవుతోందట. అందుకే ఈ గ్యాప్ లో 'ఓజీ 2'ను పట్టాలెక్కించే ఆలోచనలో సుజీత్ ఉన్నారట.
ఈ క్రేజీ సీక్వెల్కు సంబంధించి మరో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి భాగాన్ని నిర్మించిన డీవీవీ దానయ్య ఈ సీక్వెల్ను కూడా నిర్మిస్తారా, లేదా పవన్ కళ్యాణ్ సొంత ప్రొడక్షన్ హౌస్ రంగంలోకి దిగుతుందా అనేది సస్పెన్స్గా మారింది. గతంలో 'ఓజీ' షూటింగ్ సమయంలో జపాన్ షెడ్యూల్ కోసం దర్శకుడు సుజీత్ తన సొంత కారును అమ్ముకున్నారనే వార్త విన్న పవన్ కళ్యాణ్, సినిమా విడుదలయ్యాక ఆయనకు కొత్త కారును బహుమతిగా ఇచ్చారు. అప్పట్లో సుజీత్, నిర్మాత దానయ్య మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయనే టాక్ నడిచింది. దీనికి తోడు నాని, సుజీత్ ల 'బ్లడీ రోమియో' నిర్మాణ సంస్థ కూడా మారడంతో, ఇప్పుడు 'ఓజీ 2' ప్రొడక్షన్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి కూడా ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించనుండగా, కథలో భాగంగా కొన్ని సరికొత్త పవర్ఫుల్ క్యారెక్టర్లు ఎంటర్ కాబోతున్నాయని తెలుస్తోంది.





