.webp)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయం తెలిసిందే. ప్రస్తుతం ఓటిటి లో రన్ అవుతూ ఉంది. రీసెంట్ గా లెజండరీ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ద్వయంలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ 'పరుచూరి పాఠాలు' ద్వారా 'పెద్ది' సినిమాపై విశ్లేషణాత్మక రివ్యూ ఇచ్చి సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకి తెరలేపారు. సినిమాలోని ప్లస్ పాయింట్లతో పాటు కొన్ని ప్రధానమైన లోపాలని కూడా ఆయన స్పష్టంగా చెప్పడం విశేషం.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 'ఓట్లే లేని ఒక చిన్న గ్రామంలో రైలు ఆగాలి' అనే ఒకే ఒక్క ప్రతిపాదన చుట్టూ కథ అల్లుకుని, మూడు గంటల నిడివి ఉన్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాగా మలచడం సాధారణ విషయం కాదు. ఊరికి గుర్తింపు తీసుకురావాలనే తపనతో హీరో క్రికెట్, కుస్తీ వంటి క్రీడల్లో ఓడిపోయినప్పటికీ, చివర్లో రన్నింగ్ రేసులో అసాధారణ ప్రతిభ చాటి తన ఆశయాన్ని సాధించే క్రమం ప్రేక్షకులకి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా సినిమా చివరి సన్నివేశాల్లో అందించిన సామాజిక సందేశం నన్ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు పెద్ది విజయంలో రామ్ చరణ్ పాత్ర అద్వితీయమైనది. సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ తన ఒంటిచేతితో, స్వయంకృషితో భుజాలపై మోశాడు.
ఒకవేళ ఈ సినిమాలో చరణ్ స్థానంలో వేరే ఏ హీరో నటించినా ఫలితం మరోలా ఉండేది. కేవలం ఆయనకున్న ఇమేజ్ మరియు అద్భుత నటన వల్లే థియేటర్ల వద్ద భారీ వసూళ్లు వచ్చాయి. కుస్తీ యోధుడిగా శారీరక మార్పులు చేసుకోవడం, భావోద్వేగాలను పండించిన తీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే సినిమా నిడివి బాక్సాఫీస్ వద్ద పెద్ద ప్రతికూలాంశంగా మారింది. మూడు గంటల రన్టైమ్లో దాదాపు 30 నుంచి 40 నిమిషాల వరకు సన్నివేశాలను తొలగించవచ్చు. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ సగటు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా లేకపోవడం కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్. జాన్వీ కపూర్ పాత్ర నిడివి చాలా తక్కువ నిడివితో ఉండటం బాగోలేదు. . ఏదేమైనా, ఒక విభిన్నమైన క్రీడా నేపథ్యాన్ని ఎంచుకుని మెగా అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందించినందుకు పెద్ది చిత్రబృందాన్ని ప్రశంసిస్తున్నాను. దర్శకుడు బుచ్చిబాబు పనితనం కూడా బాగుందని చెప్పుకొచ్చారు.
Ram Charan, Peddi, Janhvi kapoor, Paruchuri Gopalakrishna





