ఒకే రోజు ముగ్గురు...
on Mar 5, 2021
దాదాపు ఐదేళ్ళ క్రితం విడుదలైన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ `ఊపిరి`(2016)లో కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ కార్తి, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అన్నీ ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత ఈ ముగ్గురు ఒకే తేదిన వేర్వేరు సినిమాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. నాగ్ టైటిల్ రోల్ లో నటించిన యాక్షన్ డ్రామా `వైల్డ్ డాగ్` ఏప్రిల్ 2న థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున కార్తి కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం `సుల్తాన్` అదే పేరుతో తెలుగులో అనువాద రూపంలో రాబోతోంది. అలాగే.. తమన్నా విషయానికి వస్తే.. గోపీచంద్ కి జోడీగా ఈ అమ్మడు నటించిన స్పోర్ట్స్ డ్రామా `సీటీమార్` కూడా సేమ్ ఏప్రిల్ 2కి రిలీజ్ కాబోతోంది. దీంతో.. `ఊపిరి` స్టార్స్ మధ్య సాగనున్న ఈ పోటీ ఎంతో ఆసక్తికరంగా మారింది.
మరి.. ఈ బాక్సాఫీస్ వార్ లో నాగ్, కార్తి, తమన్నా చిత్రాల్లో వేటికి ఆదరణ దక్కుతుందో తెలియాలంటే మరో నాలుగువారాల వరకు వేచిచూడాల్సిందే.