
- ఈగలు తోలుకుంటున్నాను
- హార్మోనియం ఎక్కడుందో తెలియదు
- మణిశర్మ షాకింగ్ కామెంట్స్
మణిశర్మ ఎంత గొప్ప సంగీత దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన పాటలను అందించి మెలోడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కొత్త బెంచ్ మార్క్ నే సెట్ చేశారని చెప్పవచ్చు. అలాంటి మణిశర్మకు కొంతకాలంగా సినిమాలు తగ్గిపోయాయి. (Mani Sharma)
కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తుండటంతో మణిశర్మ రేసులో వెనకబడిపోయారు. ఒకప్పుడు తమ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాలని కోరుకునే ఎందరో స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు.. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ లో పడి వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మణిశర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'చెన్నై లవ్ స్టోరీ'(Chennai Love Story) సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్.కె.ఎన్ తో కలిసి బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి 'గురుతుందా' సాంగ్ ను లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ లో మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
"ఈగలు తోలుకుంటున్నాను" అంటూ తనకు కొంతకాలంగా సరైన అవకాశాలు లేవనే విషయాన్ని మణిశర్మ చెప్పారు. "ఈగలు తోలుకునే నా దగ్గరకు సాయి రాజేష్ వచ్చి, నేను బేబీ దర్శకుడినని పరిచయం చేసుకున్నారు. ఈయనకు నాతో ఏం పని అనుకున్నాను. మీరు మా సినిమాకి మ్యూజిక్ చేయాలి సార్ అన్నారు. నా హార్మోనియం ఎక్కడుందో కూడా తెలీదు. ఆయనే వెతికి పట్టుకొని, దుమ్ము దులిపి, నన్ను కూర్చోబెట్టారు. ఒక ట్యూన్ అయ్యాక తెలిసింది.. మళ్ళీ లోపల నుంచి మ్యూజిక్ బయల్దేరిందని" అంటూ మణిశర్మ చెప్పుకొచ్చారు.
మణిశర్మ కామెంట్స్ విని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఒకప్పుడు ఎన్నో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ను అందించిన మణిశర్మ.. ఇప్పుడిలా మాట్లాడుతుంటే చూడలేకపోతున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మణిశర్మ అనే కాదు.. ఎందరో సీనియర్ సంగీత దర్శకుల పరిస్థితి ఇలాగే ఉంది. ఒకప్పుడు ఎన్నో చార్ట్ బస్టర్స్ ఇచ్చి, ఇప్పుడసలు లైమ్ లైట్ లో లేకుండా పోయారు. కీరవాణి సైతం ప్రస్తుతం రాజమౌళి సినిమాలకే పరిమితమయ్యారు.






