
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) త్వరలో ఒక క్రేజీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. 'ఉప్పెన' సినిమాతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన ఈ యంగ్ హీరో, ఆ తర్వాత తనదైన శైలిలో కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ దర్శకుడు మహేష్ సూరపనేనితో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ గతంలో కథలో రాజకుమారి, హంట్ వంటి సినిమాలు చేశారు. వైష్ణవ్ తేజ్ కోసం ఆయన ఒక విభిన్నమైన కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ సినిమా వైష్ణవ్ తేజ్లోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని టాక్.
ఈ ప్రాజెక్టును ఏకే ఎంటర్టైన్మెంట్స్ (AK Entertainments) బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించనున్నారు. ఈ ఏడాది 'నారీ నారీ నడుమ మురారి'తో హిట్ కొట్టి జోష్ లో ఉన్నారు అనిల్ సుంకర. అదే ఉత్సాహంతో మెగా హీరోతో హిట్ కొట్టాలని చూస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని టాక్.
వైష్ణవ్ తేజ్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా, ఈ కొత్త ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. మహేష్ మార్క్ టేకింగ్, అనిల్ సుంకర నిర్మాణ విలువల కలయికలో రాబోతున్న ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడం ఖాయమని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.






