మాదాల రంగారావు మనవడు మాదాల సన్నీ హీరోగా ‘ఓ టార్చర్ ప్రేమ’!
on Feb 4, 2026
మాదాల రంగారావు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పూర్తి స్థాయి విప్లవ చిత్రాలకు శ్రీకారం చుట్టిన తొలి కథానాయకుడు, నిర్మాత. 1974లో వచ్చిన ఛైర్మన్ చలమయ్య చిత్రంతో నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్గా నటించిన రంగారావుకు విప్లవ భావాలు ఎక్కువ. అందుకే తన భావాలకు అనుగుణంగా ఉండే చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనుకున్నారు. 1980లో నవతరం పిక్చర్స్ పేరుతో ఓ బేనర్ను స్థాపించి తొలి ప్రయత్నంగా ధవళ సత్యం దర్శకత్వంలో ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డు, ఉత్తమ నటుడుగా ప్రభాకరరెడ్డికి, ద్వితీయ ఉత్తమ కథా రచయితగా మాదాల రంగారావుకు నంది అవార్డులు లభించాయి.
తొలి చిత్రం సాధించిన విజయంతో విప్లవ కేతనం ఎగరేసి తమ బేనర్లో ఎర్రమల్లెలు, ప్రజాశక్తి వంటి సినిమాలు నిర్మించారు. అలాగే మరో కురుక్షేత్రం, విప్లవశంఖం, మహాప్రస్థానం, నవోదయం, స్వరాజ్యం, వీరభద్రుడు, తొలిపొద్దు, ఎర్రసూర్యుడు, ఎర్రపావురాలు వంటి విప్లవ చిత్రాల్లో నటించి రెడ్స్టార్గా పేరు తెచ్చుకున్నారు మాదాల రంగారావు. యువతరం కదిలింది చిత్రం నుంచి 2004లో వచ్చిన నేను సైతం వరకు 15 సినిమాల్లో నటించారు. అర్థరాత్రి స్వతంత్రం చిత్రంతో దర్శకనిర్మాతగా, హీరోగా పరిచయమైన ఆర్.నారాయణమూర్తి ఆ తర్వాతి కాలంలో కేవలం విప్లవ చిత్రాలే నిర్మించడానికి మాదాల రంగారావు స్ఫూర్తిగా నిలిచారు.
మాదాల రంగారావు నట వారసుడిగా ఆయన తనయుడు మాదాల రవి ఎర్రమల్లెలు చిత్రంలో బాలనటుడిగా కనిపించారు. వైద్యవత్తిలో రాణిస్తూనే ‘నేను సైతం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మా ఇలవేల్పు, బ్రోకర్ 2, పంచముఖి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్ప్పుడు ఆయన తనయుడు, మాదాల రంగారావు మనవడు మాదాల సన్ని నటుడిగా పరిచయం అవుతున్నారు. ‘ఓ టార్చర్ ప్రేమ’ చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీకష్ణ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో మౌనిక డాకోజు హీరోయిన్గా పరిచయం అవుతోంది.
‘ఓ టార్చర్ ప్రేమ’ చిత్రం టైటిల్ పోస్టర్ను ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా మాదాల రంగారావుగారి మనవడు, మాదాల రవి కుమారుడు మూడోతరం హీరో సన్నీ మాదాల హీరోగా పరిచయం అవుతున్నాడు. తాత మార్గం, తండ్రి మార్గం విప్లవం అయితే మూడోతరం హీరో సన్నీ మాదాల ప్రేమ మార్గాన్ని ఎన్నుకున్నాడు. ‘ఓ టార్చర్ ప్రేమ’ అనే అద్భుతమైన ప్రేమ కథా చిత్రంతో వస్తున్నాడు. రచన, దర్శకత్వం మేం చాలా సినిమాలకు చేశాం. అయితే దాసరి నారాయణరావుగారి బాటలో రచన, దర్శకత్వంతోపాటు చిత్ర నిర్మాణం కూడా చేపట్టాడు శ్రీకర్ కష్ణ. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
దర్శకుడు శ్రీకర్ కృష్ణ మాట్లాడుతూ ‘ఇది ప్రేమకథా చిత్రమే అయినా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను రాజీవ్ కనకాల, వడ్లమాని సాయి శ్రీనివాస్, శ్రీవాణి, జబర్దస్త్ రోహిణి, నాగి, సిద్ధర్థ్వర్మ, విష్ణుప్రియ, యాదమ్మరాజు తదితరులు పోషించారు. ఇషాక్ వలి ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



