48 గంటలుగా నరకం అనుభవిస్తున్నాం.. 'తీన్మార్' హీరోయిన్ ట్వీట్!
on May 4, 2021
మన ఇంటికి వచ్చేదాకా కొవిడ్-19 అనేది ఎంత చెడ్డదో మనకు తెలీదని నటి కృతి ఖర్బందా జనాన్ని హెచ్చరించారు. అందర్నీ ఇళ్లల్లోనే ఉండమని ఆమె కోరారు. టాలీవుడ్లో చేసిన 'బోణి' సినిమాతో హీరోయిన్గా బోణి కొట్టిన ఆమె ఆ తర్వాత పవన్ కల్యాణ్ జోడీగా 'తీన్మార్'లో నటించారు. మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త, ఓమ్ 3డి, బ్రూస్లీ లాంటి సినిమాలు చేసినా ఇక్కడ చెప్పుకోదగ్గ రీతిలో కెరీర్ ఎదగలేదు. దాంతో బాలీవుడ్కెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంది. టాలీవుడ్తో పోల్చుకుంటే అక్కడ బెటర్గానే ఆమె కెరీర్ కొనసాగుతూ వస్తోంది.
ఇటీవల ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కొవిడ్-19 బారినపడ్డారు. దాంతో తనతో పాటు తన కుటుంబం కూడా నరకం అనుభవిస్తోందని ఆమె ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు. "మన ఇంటిని అది తాకేదాకా అదెంత చెడ్డదో మనకు తెలీదు. మా ఫ్యామిలీ, నేను గత 48 గంటలు ఎంత నరకం అనుభవిస్తున్నామో చెప్పలేను. దయచేసి ఇళ్లల్లోనే ఉండండి. నెక్ట్స్ టైమ్ ఇంట్లోంచి కాలు బయటపెట్టేముందు, ఒక అడుగు వెనక్కు వేసి, మీ జీవితాన్ని రిస్కులో పెట్టడం కంటే కూడా అది విలువైందా కాదా అనే విషయం ఆలోచించుకోండి." అని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు.
దానికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేస్తూ, "ఈరోజు మీరు ఇంట్లోనే ఉండగలిగితే, అది అందరూ పెట్టలేనంత విలాసవంతమైంది. మీ క్షేమాన్నీ, మీ జీవితాన్నీ తేలిగ్గా తీసుకోకండి. మీ ఆశీర్వాదాలను లెక్కించుకోండి. ఒక ప్రార్థన చేయండి." అని చెప్పుకొచ్చారు. అయితే తన ఫ్యామిలీలో ఎవరికి కొవిడ్ సోకిందనే విషయం మాత్రం ఆమె వెల్లడించలేదు.
ఆమె చెప్పిన విషయాలు నిజంగానే సీరియస్గా తీసుకోదగ్గవి. ఇవాళ దేశంలో పరిస్థితులు కొవిడ్-19 అనే మహమ్మారి కారణంగా నానాటికీ దిగజారుతున్నాయి. రోజూ లక్షల సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా ఇంకెన్ని కేసులు ఉంటున్నాయో తెలీదు. అందుకే అందరూ వీలైనంత జాగ్రత్తగా ఇళ్లల్లోనే క్షేమంగా ఉండమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read