
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించిన విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). 2024 లో విడుదలైన ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ‘కల్కి 2’ (Kalki 2) కోసం ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా షూటింగ్కు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాయి పల్లవి ఆరోగ్యం సహకరించకపోవడంతో ప్లాన్ చేసిన కీలక షెడ్యూల్ రద్దయినట్లు సమాచారం.
నిజానికి ప్రభాస్, సాయి పల్లవి కాంబినేషన్లో నిన్నటి (మే 4) నుండి కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, అనూహ్యంగా సాయి పల్లవి అనారోగ్యానికి గురికావడంతో, ఆమె సెట్స్కు రాలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక చిత్ర బృందం ఆ షెడ్యూల్ను తాత్కాలికంగా రద్దు చేయాల్సి వచ్చిందని ఫిలిం నగర్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
కాగా, ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణెను తప్పించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి సాయి పల్లవి వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ నటులు తమ పోర్షన్ షూటింగ్లో పాల్గొనగా, ప్రభాస్ త్వరలోనే తిరిగి జాయిన్ కావాల్సి ఉంది. సాయి పల్లవి కోలుకున్న వెంటనే ఈ షెడ్యూల్ను మళ్ళీ ప్రారంభించే అవకాశం ఉంది.






