Home

»

Latest News

జూబ్లీహిల్స్‌లో స్థల కబ్జా యత్నం.. ఇద్దరు టాలీవుడ్ నిర్మాతలపై కేసు నమోదు.!

Jul 23, 2026 12:49PM

టాలీవుడ్ నిర్మాతలు సి. కళ్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ఉన్న ప్లాట్ నంబర్ 89 స్థలం కబ్జా యత్నానికి గురైందంటూ ప్రముఖ వ్యాపారవేత్త కంఠంనేని రవిశంకర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ వివాదాస్పద ప్లాట్ నంబర్ 89 స్థలానికి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉందనే విషయాన్ని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా, జూన్ 10న గౌరవ కోర్టు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం, రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు (ఇంజక్షన్ ఆర్డర్) ఇస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారని రవిశంకర్ ఆరోపించారు.

కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిందితులు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని రవిశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు దౌర్జన్యంగా ఆస్తి కాంపౌండ్ గేటు తాళాలు పగులగొట్టారని, గేటును తీవ్రంగా ధ్వంసం చేశారని ఆయన వివరించారు. ఆవరణలో ఉన్న సామాగ్రిని చెల్లాచెదురుగా పడేసి, అక్కడున్న భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వెల్లడించారు.

అంతటితో ఆగకుండా, ఆ ప్లాట్‌లో నిర్మించిన ఒక గదిని కూడా నిందితులు ధ్వంసం చేశారని రవిశంకర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

 

Kantamneni Ravi Shankar, Land Dispute, C Kalyan, Burugupalli Sivaramakrishna

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com