రొమాంటిక్ సాంగ్ తో మొదలెట్టనున్న మహేశ్!
on Sep 23, 2021
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా.. 2022 సంక్రాంతికి సందడి చేయనుంది. ఇదిలా ఉంటే.. `సర్కారు వారి పాట` విడుదలయ్యేలోపే తన నెక్స్ట్ వెంచర్ ని పట్టాలెక్కించబోతున్నారు మహేశ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. నవంబర్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ బాట పట్టనుందని సమాచారం.
అంతేకాదు.. తొలి షెడ్యూల్ ని ఓ మాంచి రొమాంటిక్ సాంగ్ తో మొదలుపెట్టనున్నారని, మహేశ్ - పూజా హెగ్డేపై విదేశాల్లో తీసే ఈ గీతం సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వినికిడి. ఇప్పటికే తమన్ ఈ పాటని రికార్డ్ కూడా చేసేశాడట. కాగా, రొమాంటిక్ సాంగ్ తరువాత ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని డిజైన్ చేశారట త్రివిక్రమ్. అదయ్యాకే టాకీ పార్ట్ పై ఫోకస్ పెడతారని ఇన్ సైడ్ టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
`అతడు`, `ఖలేజా` తరువాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో థర్డ్ జాయింట్ వెంచర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. 2022 ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.