దేశంలో యుద్ధ వాతావరణం.. అయోమయంలో స్టార్ హీరోలు!
on May 10, 2025
ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై యుద్ధభేరి మోగించి ఆ దేశ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది భారత్. గతంలో నాలుగు సార్లు భారత్తో తలపడిన పాకిస్తాన్ ప్రతిసారీ ఓటమి పాలైంది. పహల్గామ్లో టెర్రరిస్టులు చేయడం, దానికి పాకిస్తాన్ మద్దతు ఉండడంతో దేశ ప్రజలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ తన ప్రతీకార చర్య ప్రారంభించింది. దీంతో దేశంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్లను వాయిదా వేసింది. పలు విమానాలని కూడా రద్దు చేసింది.
ఇదిలా ఉంటే.. యుద్ధ ప్రభావం సినిమాలపైన కూడా పడే అవకాశం కనిపిస్తోంది. అందుకే కొన్ని పాన్ ఇండియా సినిమాల రిలీజ్లను వాయిదా వేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో భారీ స్థాయిలో రూపొందిన ‘కింగ్డమ్’ చిత్రాన్ని మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ను కూడా స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఇటీవల ఫస్ట్ సింగిల్ను కూడా విడుదల చేశారు. తాజాగా దేశంలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ‘కింగ్డమ్’ చిత్రం రిలీజ్ను వాయిదా వెయ్యాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిందట. ఎందుకంటే ఉత్తరాదిలో యుద్ధ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ పరిస్థితిలో థియేటర్కి ప్రేక్షకులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న పవన్కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ను మరోసారి వాయిదా వేశారని తెలుస్తోంది. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ప్యాచ్ వర్క్ పూర్తి కాకపోవడంతో పలు మార్లు వాయిదా వేశారు. ఇప్పుడు యుద్ధం వల్ల రిలీజ్ మరి కాస్త వెనక్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. సాధారణ సినిమాల కంటే పాన్ ఇండియా మూవీస్కే ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో రిలీజ్ చేస్తే నార్త్లో కలెక్షన్స్ వచ్చే అవకాశం లేదు. అందుకే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వాయిదా పడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ టీమ్ రెడీ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో నటించిన ‘భైరవం’ చిత్రాన్ని మే 30న విడుదల చేస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 క్రిస్మస్కి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్ని వాయిదా వేశారు. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం ‘భైరవం’ యూనిట్కి బాగా కలిసొచ్చే అంశం కావడంతో మే 30న రిలీజ్ చేస్తున్నారు. పైగా ఈ సినిమాకి బడ్జెట్పరంగా రిస్క్ కూడా తక్కువగా ఉండడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
