సెకండాఫ్ లో గోపీచంద్ `ట్రిపుల్ ధమాకా`!
on Jun 21, 2021
మ్యాచో స్టార్ గోపీచంద్ 20 ఏళ్ళ కెరీర్ ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. కథానాయకుడిగా కనిపించినా.. ప్రతినాయకుడిగా పరవశింపజేసినా.. ఏ క్యాలెండర్ ఇయర్ లో కూడా రెండుకి మించిన సినిమాలతో పలకరించిన సందర్భాలు లేవు. అలాంటిది.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ముచ్చటగా మూడు సినిమాలతో సందడి చేసే దిశగా అడుగులు వేయబోతున్నారీ టాలెంటెడ్ యాక్టర్.
ఆ వివరాల్లోకి వెళితే.. చాన్నాళ్ళుగా విడుదలకు నోచుకోని గోపీచంద్ చిత్రం `ఆరడుగుల బుల్లెట్` (బి. గోపాల్ దర్శకత్వం) ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతోంది. అన్నీ అనుకూలిస్తే.. జూలై నెలలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చిత్రీకరణ పూర్తిచేసుకున్న గోపీచంద్ స్పోర్ట్స్ డ్రామా `సీటీమార్`(సంపత్ నంది డైరెక్షన్)ని కూడా సెకండాఫ్ లోనే జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. మారుతి డైరెక్టోరియల్ `పక్కా కమర్షియల్`ని కూడా ఇదే సంవత్సరం చివరలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మొత్తమ్మీద.. 2021 సెకండాఫ్ లో ముచ్చటగా మూడు సినిమాలతో గోపీచంద్ `ట్రిపుల్ ధమాకా` ఇవ్వబోతున్నారన్నమాట. మరి.. `లౌక్యం` తరువాత ట్రాక్ తప్పిన గోపీకి.. ఈ చిత్రత్రయాల్లో ఏ సినిమా మళ్ళీ అతణ్ణి విజయపథంలో నడిపిస్తుందో చూడాలి.