
'మిర్జాపూర్' వెబ్ సిరీస్ తో 'మున్నా భయ్యా'గా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు దివ్యేందు శర్మ (Divyendu Sharma). ప్రస్తుతం రామ్ చరణ్ 'పెద్ది' (Peddi) మూవీలో నటిస్తున్నాడు. పెద్ది సినిమాలో దివ్యేందు పాత్ర ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే 'పెద్ది' కంటే ముందు మరో వెబ్ సిరీస్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు మున్నా భయ్యా.
దివ్యేందు శర్మ, పుల్కిత్ సామ్రాట్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ వెబ్ సిరీస్ 'గ్లోరీ' (Glory). 'ఇన్సైడ్ ఎడ్జ్', 'మిర్జాపూర్' వంటి బ్లాక్బస్టర్ సిరీస్ల సృష్టికర్త కరణ్ అన్షుమన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పవర్ఫుల్ స్పోర్ట్స్ క్రైమ్ థ్రిల్లర్.. మే 1 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సిరీస్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఒక హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా. హర్యానాలోని శక్తిగఢ్ అనే ప్రాంతంలో బాక్సింగ్ లెగసీని కాపాడుకోవడానికి చేసే పోరాటం, దాని వెనుక ఉన్న డార్క్ పాలిటిక్స్, అలాగే ఒక హత్య చుట్టూ తిరిగే మిస్టరీ ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వనున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఈ సిరీస్పై భారీ అంచనాలను పెంచేసింది.
దేశానికి ఒలింపిక్ బంగారు పతకాన్ని అందించాలని తపించే ఒక బాక్సింగ్ కోచ్ రఘుబీర్ సింగ్ (సువీందర్ విక్కీ) తన వారసత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతుంటాడు. అయితే, ఒక వర్ధమాన బాక్సర్ నిహాల్ సింగ్ అనుమానాస్పద మృతి, రఘుబీర్ కుమార్తె గుడియా (జన్నత్ జుబేర్)పై జరిగిన దాడి ఈ కథలో కీలక మలుపులు. ఈ సంఘటనల తర్వాత చాలా కాలంగా ఇంటికి దూరంగా ఉన్న రఘుబీర్ కుమారులు దేవ్ (దివ్యేందు), రవి (పుల్కిత్ సామ్రాట్) తిరిగి శక్తిగఢ్కు వస్తారు. తమ సోదరికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటూనే, ఆ బాక్సింగ్ రింగ్ వెనుక ఉన్న రాజకీయాలను వారు ఎలా ఎదుర్కొన్నారనేదే 'గ్లోరీ' ప్రధాన కథ.
ఇది కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ కూడా మిళితమై ఉంది. దర్శకుడు కరణ్ అన్షుమన్ స్పోర్ట్స్, క్రైమ్ను సరికొత్తగా ఈ సిరీస్లో మలిచారు. హర్యానాలోని రోహ్తక్, భివానీ ప్రాంతాల్లోని బాక్సింగ్ కల్చర్ను ఈ సిరీస్లో చాలా సహజంగా చూపించారు.






