
ధురంధర్(Dhurandhar)ని చూసిన వాళ్ళకి పార్లమెంటుపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసి కొంత మందిని చంపిన విషయం తెలిసిందే. ఆ దాడిలో అక్కడే డ్యూటీ చేస్తున్న సీఆర్పీఎఫ్ మహిళ కూడా కాల్పుల్లో చనిపోతుంది. రేపు రిటైర్ కాబోతుందని స్వీట్స్ పంచుతూ ఉండగా ఆమె చనిపోవడం ప్రతి ఒక్కర్ని ఎంతగానో కలిచివేస్తుంది. అంత ఇదిలో కూడా ఆమె గేట్ కనుక మూయకుండా ఉంటే ప్రమాద తీవ్రత ఊహకి కూడా అందని విధంగా మరింత ఘోరంగా ఉండేది.ఇదంతా నిజ జీవితంలో మన ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ హౌస్పై ఉగ్రవాదులు దాడి చేసిన నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారు.
ఆ చీకటి రోజుని మన దేశప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. 2001 డిసెంబర్ 13వ తేదీ ఉదయం సుమారు 11:50 గంటల సమయంలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణం అంతా ఎంపీలు, విఐపీల రాకపోకలతో ఎంతో కోలాహలంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఐదుగురు సాయుధ ఉగ్రవాదులు 'DL 3C J 1527' నంబర్ గల నకిలీ స్టిక్కర్ ఉన్న అంబాసిడర్ కారులో ఐరన్ గేట్ నంబర్ 1 ద్వారా బిల్డింగ్ గేట్ నంబర్ 11 వైపు దూసుకొచ్చారు. దేశ అగ్ర నాయకులు, పదుల సంఖ్యలో ప్రజాప్రతినిధులు లోపల ఉన్న ఆ కీలక సమయంలో, ఉగ్రవాదులు భారీ ఆయుధాలు, ఆత్మాహుతి బాంబులతో దాడి చేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. కానీ ఆ ఉగ్రముఠా రక్తాన్ని పారించేందుకు సిద్ధమైన వేళ, ఒక ధైర్యవంతురాలైన మహిళా సీఆర్పీఎఫ్ వారి కుట్రకు గోడలా అడ్డు నిలిచారు. ఆమెనే సీఆర్పీఎఫ్ (CRPF) 88వ మహిళా బెటాలియన్కు చెందిన వీర నారి కమలేష్ కుమారి యాదవ్. ఉత్తర ప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లా సికందర్పూర్ గ్రామానికి చెందిన కమలేష్ కుమారి, 1994లో సీఆర్పీఎఫ్లో కాన్స్టేబుల్గా చేరారు. మొదట అలహాబాద్లోని 104 ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) లో సేవలు అందించిన ఆమె, 2001 జులై 12న 88వ మహిళా బెటాలియన్కు బదిలీ అయ్యారు. పార్లమెంట్ భద్రతా బాధ్యతల్లో భాగంగా బ్రావో కంపెనీలో విధులు నిర్వహిస్తున్న కమలేష్ కుమారి, డిసెంబర్ 13న ఐరన్ గేట్ నంబర్ 1 వద్ద డ్యూటీలో ఉన్నారు. కారు వేగంగా గేటు వైపు రావడాన్ని గమనించిన కమలేష్, ఏదో విపత్తు జరగబోతోందని క్షణాల్లో పసిగట్టారు. ఆమె వద్ద ఎటువంటి భారీ ఆయుధం లేదు.
Also read: పెద్ది బుచ్చిబాబు నెక్స్ట్ హీరో ఇతనే!
కేవలం ఒక వాకీ-టాకీ మాత్రమే ఉంది. అయినప్పటికీ ఆమె కొంచెం కూడా భయపడకుండా కారును నిరోధించడానికి వెంటనే ముందుకు ఉరికి, గేటును లాక్ చేసేందుకు ప్రయత్నించారు. తన వద్ద ఉన్న వాకీ-టాకీ ద్వారా ఇతర సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ, గట్టిగా కేకలు వేసి అలారమ్ మోగించారు. తమ ప్లాన్ బయటపడిందని గ్రహించిన ఉగ్రవాదులు వెంటనే కమలేష్ కుమారిపై విచక్షణారహితంగా ఏకే-47 తుపాకీలతో కాల్పులకు తెగబడ్డారు. ఆ దాడిలో కమలేష్ కుమారి శరీరంలోకి ఏకంగా 11 బుల్లెట్లు దూసుకెళ్లాయి. శరీరం రక్తాసిక్తమైనా, ప్రాణాలు పోతున్న క్షణాల్లోనూ ఆమె చూపిన అపారమైన సమయస్ఫూర్తి వల్ల లోపల ఉన్న భద్రతా దళాలు తక్షణమే అప్రమత్తమయ్యాయి. కమలేష్ సమయానికి గేటు మూసి హెచ్చరించకపోతే, ఆత్మాహుతి బాంబర్ పార్లమెంట్ లోపలికి ప్రవేశించి వందలాది మంది ప్రజాప్రతినిధుల ప్రాణాలను తీసి ఉండేవాడు. ఆమె ప్రాణత్యాగం ఉగ్రవాదుల యత్నాన్ని పూర్తిగా భగ్నం చేసింది.ఈ ఘోర దాడిలో మొత్తం తొమ్మిది మంది భద్రతా సిబ్బంది మరియు పౌరులు వీరమరణం పొందగా, ఐదుగురు ఉగ్రవాదులు సైన్యం చేతిలో మరణించారు. కమలేష్ కుమారి భర్త అవధేష్ యాదవ్, ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శ్వేతలను విడిచిపెట్టి దేశం కోసం అమరురాలయ్యారు. ఆమె చూపించిన అసమాన ధైర్యసాహసాలకుగాను 2002 గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఆమెకు శాంతియుత కాలంలో ఇచ్చే అత్యున్నత మిలిటరీ పురస్కారం 'అశోక చక్ర'ను మరణానంతరం ప్రదానం చేసింది. భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు అశోక చక్ర పొందిన కేవలం ఇద్దరే ఇద్దరు మహిళల్లో కమలేష్ కుమారి ఒకరు కావడ విశేషం (మరొకరు నీర్జా భానోత్). కమలేష్ కుమారి త్యాగం భారత చరిత్ర పుటల్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది.మరి నెల నెల సాలరీ తీసుకుంటూ డిస్పాచ్ టైం కంటే పది నిముషాలు ఎక్కువసేపు ఆఫీస్ లో ఉంటే దేశానికి సేవ చేసినట్టుగా ఫీలయ్యే వాళ్ళు కమలేష్ కుమారి యాదవ్ పోరాట స్ఫూర్తి తెలుసుకోవడం ఎంతైనా అవసరం.
Dhurandhar, Ranveersingh, kamlesh kumari yadav






