కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వారసుడు యాత్ర రాజా వెండితెర ఎంట్రీపై ఇప్పుడు చెన్నై చిత్ర పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తన నటనతో, విలక్షణమైన కథలతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, ఇప్పుడు తన పెద్ద కొడుకును హీరోగా పరిచయం చేసేందుకు బ్యాక్గ్రౌండ్లో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా లాంచింగ్ బాధ్యతలను ఒక స్టార్ డైరెక్టర్కు అప్పగించనున్నారనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
ఇటీవలే 'అమరన్' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు రాజకుమార్ పెరియాసామి.. ప్రస్తుతం ధనుష్ 55వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకుమార్ మేకింగ్ స్టైల్కు ఇంప్రెస్ అయిన ధనుష్, తన కొడుకు యాత్ర రాజా డెబ్యూ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించే యోచనలో ఉన్నట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం 19 ఏళ్ల వయసున్న యాత్ర రాజా, హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు కావాల్సిన అన్ని హంగులను సిద్ధం చేసుకుంటున్నాడు. యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్లలో విదేశాల్లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతున్నట్లు సమాచారం. అయితే కొడుకు ఎంట్రీపై ధనుష్ గతంలో స్పందిస్తూ.. తాను 16 ఏళ్లకే ఇండస్ట్రీలోకి రావాల్సి వచ్చిందని, కానీ ఇప్పటి పరిస్థితులు వేరని వ్యాఖ్యానించారు. కొడుకును తొందరపడి కాకుండా పక్కా ప్లానింగ్తో లాంచ్ చేయాలని ఆయన భావిస్తున్నారు.
గతంలో ధనుష్ను ఆయన తండ్రి, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా 'తుళ్ళువదో ఇలామై' (తెలుగులో జూనియర్స్) సినిమాతో పరిచయం చేశారు. ఆ తర్వాత సోదరుడు సెల్వరాఘవన్ అందించిన కథలు ధనుష్ను స్టార్ను చేశాయి. అదే సెంటిమెంట్తో తన కొడుకును కూడా తానే డైరెక్ట్ చేస్తాడా, లేదా కేవలం వండర్బార్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించి వేరే దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.
ప్రస్తుతం ఈ వార్తలపై సోషల్ మీడియాలో అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ధనుష్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ వారసుడిగా వస్తున్న యాత్ర రాజా ఎలాంటి కథతో వస్తాడోనని అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు ఫ్యాన్స్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిపై వండర్బార్ ఫిల్మ్స్ నుండి అధికారిక ప్రకటన వస్తేనే క్లారిటీ రానుంది.




