నా తమ్ముడిని డాక్టర్లే చంపేశారు.. కమెడియన్ గౌతంరాజు ఆవేదన
on May 15, 2021
తెలుగు చిత్ర పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనాతో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మృతి చెందారు. తాజాగా కమెడియన్ గౌతంరాజు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు సిద్దార్థ కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లనే వైద్యం అందక తన సోదరుడు మృతిచెందాడని గౌతంరాజు ఆరోపణలు చేశారు. పేషంట్స్ పట్ల వైద్యులు మానవతా దృక్పథంతో వ్వవహరించడం లేదని మండిపడ్డారు. రోగులకు మనోధైర్యాన్ని నింపకుండా మీకు లంగ్స్ పనిచేయటం లేదు, చనిపోతారని పేషంట్స్ తో చెప్పటం దారుణమని అన్నారు. మూడురోజులుగా ట్రీట్మెంట్ అందించిన వైద్యులు.. లంగ్స్ దెబ్బతిన్నాయని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఆక్సిజన్ తగ్గించేసి నిర్లక్ష్యంగా వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు తెలిసినవారి రికమండేషన్ బెడ్స్ కోసం పాత కేసుల ప్రాణాలు తీసి బెడ్స్ ఖాళీ చేయిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. చరిత్ర కలిగిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి కొంతమంది వైద్యులు వలన చెడ్డ పేరు వస్తుందని అన్నారు.
మా తమ్ముడుకు జరిగిన అన్యాయం మరోకరికి జరగకూడదనే ఉద్దేశంతో బాధపడి ఈ విధంగా మాట్లాడుతున్నాను అన్నారు గౌతం రాజు. ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా పరిస్థితి అలానే ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి, బయట పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయని గౌతం రాజు అన్నారు.