ఏపీలో 'వకీల్ సాబ్'తో పాటు బిగ్ బడ్జెట్ సినిమాలన్నింటికీ దెబ్బే!
on Apr 11, 2021
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేసిన 'వకీల్ సాబ్' మూవీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యహరిస్తోన్న తీరు టాలీవుడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే అక్కడి సినిమా హాళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లుల విషయంలో రాయితీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి, నాగార్జున లాంటి బిగ్ స్టార్స్ కృతజ్ఞతలు తెలిపారు. అంతలోనే 'వకీల్ సాబ్'ను టార్గెట్ చేస్తూ ఆ ప్రభుత్వం టిక్కెట్ రేట్ల పెంపును తిరస్కరించడం, అదనపు షోలను నిరాకరించడం వంటి పనులు చేయడంతో వారు హతాశులయ్యారు. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకరంగా వ్యవహరిస్తుంటే, ఆంధ్ర ప్రభుత్వం ధోరణి అందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వ్యక్తమవుతోంది.
'వకీల్ సాబ్' సినిమా ముందు వరకు విడుదలైన సినిమాల వారు నార్మల్ రేట్ల కంటే ఎక్కువ రేట్లకు మొదట్లో టిక్కెట్లు అమ్ముకొని లాభపడ్డారు. కానీ 'వకీల్ సాబ్' లాంటి భారీ బడ్జెట్ సినిమా విషయంలో ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. మొదట అదనపు షోలకు టిక్కెట్లు అమ్ముకోనిచ్చి, తీరా సమయం దగ్గరపడ్డాక వాటిని రద్దు చేసింది. అలాగే నార్మల్ రేట్లకు మించి టిక్కెట్ ధరలను అమ్ముకోడానికి నిరాకరించింది. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు మూడు రోజుల పాటు టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం స్వయంగా డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పును శనివారం డివిజన్ బెంచ్ సవరించింది. అప్పటివరకు ఎక్కువ రేట్లకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ విషయంలో వాటిని వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతూ మూడో రోజు నుంచి అంటే నేటి నుంచి నార్మల్ రేట్లకే అన్ని థియేటర్లలో టిక్కెట్లు అమ్మాలని తీర్పు ఇచ్చింది. దీంతో 'వకీల్ సాబ్'కు మరో దెబ్బ తగిలినట్టయింది.
కోర్టు మరో విషయం కూడా స్పష్టపరిచింది. తమ తీర్పు కేవలం 'వకీల్ సాబ్'కి మాత్రమే కాకుండా, భవిష్యత్తుల్లో విడుదలయ్యే అన్ని సినిమాలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో కేవలం రూ. 30, రూ. 50, రూ. 70లకే టిక్కెట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎగ్జిబిటర్లకు. ఇవి నాలుగైదేళ్ల క్రితం నాటి రేట్లు కావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ రకంగా 'వకీల్ సాబ్'తో పాటు భవిష్యత్ బిగ్ బడ్జెట్ సినిమాలకూ దెబ్బ తగిలినట్లయింది. నిన్ననే ఒక విషయంలో ప్రభుత్వాన్ని పొగిడిన సినీ పెద్దలు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారు. త్వరలో మెగాస్టార్ 'ఆచార్య' సినిమా కూడా రిలీజ్ కానున్నది. దానికి సైతం నార్మల్ రేట్లకే టిక్కెట్లను అమ్ముకోక తప్పదు. ఇది కలెక్షన్లపై బాగా ప్రభావం చూపనున్నది.