మనం నివసించే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంట్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు. అది మన తండ్రి రక్తమాంసాలతో కట్టుకున్న ఒక దేవాలయం. ఆ ఇంటి ప్రతి మూలలో మన చిన్ననాటి జ్ఞాపకాలు, మన నాన్న పడిన కష్టం దాగి ఉంటాయి. అటువంటి ఇంటిని పరాయివారి పాలు కాకుండా దక్కించుకోవడం కోసం ఒక మనిషి 20 ఏళ్ల పాటు తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడితే ఎలా ఉంటుంది? పద్మనాభం కథ సరిగ్గా ఇదే. జగపతిబాబు, రమ్యకష్ణ, రవితేజ తదితరులు ముఖ్యపాత్రల్లో ఎస్.వి.కష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బడ్జెట్ పద్మనాభం’ చిత్రంలోని సన్నివేశాల సమాహారమిది.
పద్మనాభం తన తండ్రి కట్టిన ఇంటిని తిరిగి దక్కించుకోవడానికి ప్రతి రూపాయిని ప్రాణంలా దాచుకున్నాడు. ఆ ఆశయం కోసం అతను తన వ్యక్తిగత సరదాలను, ఆశలను చంపుకున్నాడు. ఎంతటి కటిక పేదరికాన్ని అనుభవించాడంటే, దేవుడికి వెలిగించాల్సిన అగరబత్తులను కూడా ముక్కలు చేసి వెలిగించి పొదుపు చేశాడు. 20 ఏళ్ల కష్టం తర్వాత, బ్యాంకు నుండి డబ్బు డ్రా చేసి, తన భార్య రమ్యతో కలిసి ఆ ఇంట్లోకి మొదటి అడుగు వేయాలని కలలు కన్నాడు.
కానీ విధి మరోలా తలచింది. సరిగ్గా ఇంటిని స్వాధీనం చేసుకోవాల్సిన ఆఖరి నిమిషంలో, స్కూటర్లో పెట్టిన డబ్బు మాయమైపోయింది. ఆ క్షణం పద్మనాభం అనుభవించిన నరకం వర్ణనాతీతం. ‘దేవుడికి కూడా నా మీద కోపం వచ్చిందేమో’ అని అతను రోదించిన తీరు మన కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. అనాధగా మిగిలిపోయానని, తన ప్రేమ కూడా ఓడిపోయిందని అతను కుమిలిపోయాడు.
అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ డబ్బుని దొంగిలించింది మరెవరో కాదు, అతని భార్య రమ్యనే. కానీ, పద్మనాభం ఆ ఇంట్లో ఉన్న పిల్లల ఏడుపు చూడలేక, తన కన్న కలని త్యాగం చేసి ‘మీరందరూ ఈ ఇంట్లోనే ఉండండి’ అని చెప్పినప్పుడు అతని ఉన్నతమైన వ్యక్తిత్వం బయటపడింది. పద్మనాభం ఎంతటి సున్నిత మనస్కుడో అర్థం చేసుకున్న రమ్య, తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం ఈ కథలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం.
డబ్బు కంటే మనుషులు, ఆస్తుల కంటే అనుబంధాలు గొప్పవని నిరూపించే ఈ గాథ మనందరికీ ఒక గుణపాఠం. కష్టకాలంలో కూడా ఎదుటివారి బాధను అర్థం చేసుకునే గుణం ఉన్నవాడే నిజమైన మనిషి. పద్మనాభం తన ఇంటిని దక్కించుకున్నాడా లేదా అనే దానికంటే, అతను అందరి మనసులను గెలుచుకున్నాడన్నదే ముఖ్యం. ఇంతటి భావోద్వేగమైన వీడియోను మీకు అందిస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.







