కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య ఉండే బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెరపై ఎంత పోటీ ఉన్నా, బయట మాత్రం ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ను కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ అనంతరం విశాల్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఒక ఆసక్తికరమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తమ కాలేజీ రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విజయ్ను తాను 'డార్లింగ్' అని సంబోధించారు విశాల్. లయోలా కాలేజీలో చదువుకునే రోజుల్లో విజయ్ను ఏ విధంగా పిలిచేవాడో, ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ అదే పిలుపును కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పదవులు మారినా, కాలం గడిచినా విజయ్లోని సింప్లిసిటీ, ఆప్యాయత ఏమాత్రం మారలేదని విశాల్ ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో విజయ్ ఎదిగిన తీరును విశాల్ అభినందించారు. ఒక సాధారణ యువ హీరోగా కెరీర్ ప్రారంభించి, తన అద్భుతమైన నటనతో సూపర్ స్టార్గా ఎదిగారని, ఆపై ఎన్నో విమర్శలు, రాజకీయ సవాళ్లను మౌనంగా భరిస్తూ నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గతంలో తనకు కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలతో ఉన్న అనుబంధాన్ని కూడా విశాల్ గుర్తుచేసుకున్నారు.
అయితే ఈ కలయికలో విశాల్ ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సీఎంలను కలిసినప్పుడు ఇచ్చే బొకేలు, శాలువాలకు బదులుగా.. ఆ ఖర్చును ముగ్గురు నిరుపేద బాలికల చదువు కోసం వినియోగించారు. సీఎం విజయ్ పేరుతోనే ఆ బాలికల విద్యకు అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించినట్లు విశాల్ వెల్లడించారు. ఈ మంచి పని వల్ల ఆ పిల్లలు జీవితాంతం విజయ్ను గుర్తుపెట్టుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అరుదైన భేటీ మరియు విశాల్ చేసిన పోస్ట్పై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని అభినందించడానికి విశాల్ ఎంచుకున్న సామాజిక కోణం నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. విజయ్ సారథ్యంలో తమిళనాడు రాష్ట్రం మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ విశాల్ తన సందేశాన్ని ముగించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇరు హీరోల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.





.webp)
