Home

»

Latest News

ఫుడ్ డెలివరీ బాయ్స్‌పై దాడులు.. సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు!

Jun 30, 2026 3:12PM

ఫుడ్ డెలివరీ బాయ్ పై 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో అఖిల్ రాజ్ దాడి చేశాడంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డెలివరీ బాయ్స్‌ ఎదుర్కొంటున్న కష్టాలను, వారిపై జరుగుతున్న దాడులను ప్రస్తావిస్తూ టాలీవుడ్ నటుడు నరేశ్ విజయకృ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ప్రముఖులు లేదా సెలబ్రిటీలు ఈ తరహా విషయాల్లో పాలుపంచుకున్నప్పుడు మాత్రమే ఇవి వార్తల్లో నిలుస్తున్నాయని, కానీ తెరవెనుక ఎంతోమంది సామాన్య డెలివరీ పార్ట్‌నర్స్‌పై జరుగుతున్న దాడులు ఎవరికీ తెలియకుండా కనుమరుగైపోతున్నాయని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆకలితో ఉన్నప్పుడు లేదా ఏదైనా అర్జెన్సీ ఉన్నప్పుడు ఆర్డర్ ఆలస్యమైతే కస్టమర్ల సహనం నశించడం సహజమే కావచ్చు, కానీ అదే సమయంలో డెలివరీ పార్ట్‌నర్స్ పడే కష్టాన్ని కూడా మనం గుర్తించాలని ఆయన కోరారు. ఒక పూట నిజాయితీగా జీవనోపాధిని సంపాదించుకోవడం కోసం వారు ట్రాఫిక్, భారీ వర్షాలు, మండే ఎండలు, రోడ్డు ప్రమాదాల వంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తారని గుర్తుచేశారు. కేవలం కొద్ది నిమిషాల ఆలస్యం కోసం ఒకరి గౌరవాన్ని, ప్రాణాల రక్షణను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని నరేశ్ ప్రశ్నించారు.

కోపానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సాటి మనుషుల పట్ల కాస్త మానవత్వాన్ని, సానుభూతిని చూపించాలని ఆయన కస్టమర్లకు విజ్ఞప్తి చేశారు. గౌరవం ఇవ్వడానికి ఎటువంటి ఖర్చు కాదని, కానీ మానవత్వం అనేది వెలకట్టలేనిదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో స్విగ్గీ, జొమాటో వంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా తమ ఫ్రంట్‌లైన్ కార్మికులను రక్షించడానికి, వారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డెలివరీ పార్ట్‌నర్స్‌ రక్షణకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ #RespectDeliveryPartners & #HumanityFirst వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో నరేశ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సమాజంలో ఒక కొత్త చర్చకు తెరలేపింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com