రెండు వారాలకే ఓటీటీలోకి 'విరాట పర్వం'
on Jun 29, 2022
విడుదలకు ముందు సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తిని కలిగించిన 'విరాట పర్వం' తీరా విడుదలయ్యాక కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలింది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 17న థియేటర్స్ లో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్స్ కి కదిలేలా మాత్రం చేయలేకపోయింది. దీంతో ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.14 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ కనీసం 5 కోట్ల షేర్ కూడా రాబట్టలేక చతికిలపడింది. ఆ దెబ్బకి థియేటర్స్ లో విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వస్తోంది.
ఇటీవల జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు మూడు నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. ఇక 'విరాట పర్వం' అయితే ఏకంగా రెండు వారాలకే ఓటీటీలో విడుదలవుతోంది. జులై 1 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో విరాట పర్వం స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.