టాలీవుడ్కి చేదు మిగిల్చిన 2018 సంక్రాంతి
on Jan 17, 2018
తెలుగు సినిమాకి సంక్రాంతి అతి పెద్ద సీజన్. అవకాశం ఉంటే తమ సినిమాల్ని సంక్రాంతి పండగ సందర్బంగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ప్రతి స్టార్ హీరో. ఎందుకంటే రైతు చేతికి డబ్బులు వచ్చి కుటుంబంతో సంబరాలు చేసుకునే అతి పెద్ద పండుగ ఇదే. అయితే, టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు తీసుకుంటే, కనీసం ఒక సినిమా అయినా బ్లాక్బస్టర్ హిట్ కొట్టడం ఆనవాయితీగా మారింది. కొన్ని సందర్భాల్లో విడుదలయిన అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. 2017 సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి ఖైదీ నంబర్ 150 , బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి, శర్వానంద్ శతమానం భవతి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.
అయితే ఈ సంక్రాంతికి విడుదలయిన ఏ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకోలేకపోయింది. మొదటగా విడుదలయిన పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ల అజ్ఞాతవాసి అటు క్రిటిక్స్ ని ఇటు ప్రేక్షకుల్ని మెప్పించడంలో విఫలమయింది. మొదటి రోజు పెద్ద మొత్తంలో కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు నుండి నిదానించింది. బయ్యర్లకి పెద్ద మొత్తంలో నష్టాలు మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇక అజ్ఞాతవాసి కి రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన బాలకృష్ణ జై సింహ సైతం కొన్ని వర్గాల్ని నిరుత్సాహ పరిచింది. పాత కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు తప్ప కొత్త దనం లేక వసూళ్ల విషయంలో యావరేజ్ గా నిలిచింది. మాస్ ఏరియాల్లో కాస్తో కూస్తో మెరుగ్గా ఉంటే, క్లాస్ సెంటర్లలో మాత్రం కలెక్షన్స్ వీక్ గా ఉన్నాయి. మొత్తానికి, బాలయ్య కూడా సంక్రాంతి హీరో అవ్వలేకపోయాడు.
రాజ్ తరుణ్ రంగుల రాట్నం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, ఈ సినిమా ఒకటి రిలీజ్ అయ్యింది అనే విషయం చాలా మందికి తెలియదు. సినిమా బాలేక పోవడం, ప్రొడ్యూస్ చేసిన నాగార్జున ప్రమోషన్స్ చేసే ధైర్యం చేయకపోవడం, వెరసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.
అయితే, లో బజ్ తో విడుదలయిన సూర్య డబ్బింగ్ సినిమా గ్యాంగ్ ఒక్కటే కాస్త బెటర్ బిజినెస్ చేస్తుంది. తమిళ్ ప్రమోషన్స్ పక్కన పెట్టి, సూర్య స్వతహాగా తెలుగు రాష్ట్రాల్లో విజయ యాత్ర చేయడం ద్వారా గ్యాంగ్ పై ఆసక్తి పెంచడంలో సఫలమయ్యాడు. మొత్తానికి సంక్రాంతికి విడుదలయిన సినిమాల్లో గ్యాంగ్ మాత్రమే చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతుంది.
ఈ విధంగా, 2018 సంక్రాంతి టాలీవుడ్ కి చేదు మిగిల్చింది.