ఒకే బాటలో రాశి, అను!
on Oct 12, 2021
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన `ఆక్సిజన్`(2017)లో కథానాయికలుగా కనువిందు చేశారు రాశీ ఖన్నా, అను ఇమ్మాన్యుయేల్. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ ఇద్దరు భామలు కూడా ఒకే బాటలో పయనిస్తున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటు రాశీ ఖన్నా, అటు అను ఇమ్యాన్యుయేల్ తమ కొత్త చిత్రాల కోసం ఇదివరకెన్నడూ కనిపించని పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ఇంతకీ ఆ వేషమేమిటంటే.. లాయర్ రోల్. గోపీచంద్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న `పక్కా కమర్షియల్` చిత్రంలో రాశి తొలిసారిగా వకీల్ గా కనిపించనుంది. ఇక అను ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. మరో రెండు రోజుల్లో తెరపైకి రాబోతున్న అజయ్ భూపతి డైరెక్టోరియల్ `మహా సముద్రం`లో న్యాయవాదిగా అలరించబోతోంది.
మొత్తమ్మీద.. `ఆక్సిజన్` భామలు రాశి, అను ఒకే బాటలో పయనిస్తున్నారన్నమాట. కాకపోతే, `పక్కా కమర్షియల్`లో రాశిది కామిక్ టచ్ ఉన్న వకీల్ రోల్ కాగా.. `మహా సముద్రం`లో మాత్రం అనుది కాస్త సీరియస్ గా సాగే క్యారెక్టర్ అని సమాచారం. మరి.. అను, రాశిలో ఎవరు లాయర్ గా ఆకట్టుకుంటారో చూడాలి.