'విక్రమ్' కంటే ముందుగానే ఓటీటీలోకి 'మేజర్'
on Jun 30, 2022
జూన్ 3న 'విక్రమ్'తో పాటు విడుదలైన 'మేజర్' మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఓ వైపు స్టార్స్ నటించిన 'విక్రమ్' కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నా.. 'మేజర్' ధీటుగా నిలబడి మంచి కలెక్షన్స్ తో ఘన విజయాన్ని అందుకుంది. విక్రమ్ తో పాటు విడుదలై, ఆ మూవీ ప్రభంజనంలోనూ విజయాన్ని అందుకున్న మేజర్.. ఇప్పుడు విక్రమ్ కంటే ముందే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
అడివి శేష్ ప్రధాన పాత్రధారిగా శశికిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మేజర్'. 26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ 30 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్ల వేట ముగింపు దశకు చేరుకోవడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోంది.
థియేటర్స్ లో విడుదలైన సరిగ్గా నెల రోజులకి ఓటీటీలోకి వస్తోంది 'మేజర్' సినిమా. జులై 3 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే మేజర్ తో పాటు జూన్ 3 న థియేటర్స్ లో విడుదలైన విక్రమ్ విషయానికొస్తే ఐదు రోజులు ఆలస్యంగా అంటే జులై 8 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read