'మా' ఎన్నికల అధికారి కీలక వ్యాఖ్యలు.. అదంతా అబద్దం!
on Oct 13, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. మా ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రకాష్ రాజ్ & టీమ్.. మంచు విష్ణు ప్యానల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల సమయంలో మోహన్ బాబు బూతులు తిట్టారని, సీనియర్ నటుడు బెనర్జీ పై చేయి కూడా చేసుకోబోయారని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. అంతేకాదు, ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లను తమ ఇంటికి తీసుకువెళ్లారని.. రాత్రికి రాత్రి ఫలితాలను తారుమారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ తాజాగా వివరణ ఇచ్చారు.
బ్యాలెట్ పేపర్లను మా ఇంటికి తీసుకువెళ్లాననేది అవాస్తవం.. పూర్తిగా నిరాధారమైన ఆరోపణ అని కృష్ణమోహన్ అన్నారు. బ్యాలెట్ పేపర్లను భద్రపరిచిన బాక్సుల తాళాలు మాత్రమే తీసుకువెళ్లానని ఆయన తెలిపారు. అలాగే అనసూయ ఎన్నికైనట్టు ప్రకటించామన్న వార్తలు సైతం అవాస్తవమేనని కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందన్న దానిలో వాస్తవం లేదని.. అధికారికంగా ప్రకటించక ముందే వార్తలు ఎలా వచ్చాయో తెలియదన్నారు.
ఆదివారం నాడు ఈసీ మెంబర్ గా అనసూయ గెలిచినట్లు వార్తలు వచ్చాయి. కానీ సోమవారం వచ్చిన అధికారిక ఫలితాల్లో ఆమె గెలవలేదు. దీంతో ఆమె సోమవారం నాడు 'ఎవరో బ్యాలెట్ పేపర్స్ను ఇంటికి తీసుకువెళ్లారట.. బయట టాకు' అని ట్వీట్ చేశారు. ఇక మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ.. 'ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకువెళ్లారు' అని ఆరోపించారు. ఈ క్రమంలో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ఆ ఆరోపణలు అవాస్తవమని ఆరోపించారు. మరి కృష్ణమోహన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ & టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read