హన్సికకి షాకిచ్చిన డైరెక్టర్.. కోర్టుకి చేరిన వ్యవహారం!
on May 15, 2021
హన్సిక మొత్వాని 50 వ సినిమాకు కష్టాలు తప్పడంలేదు. మాజీ ప్రేమికుడు శింబుతో కలిసి హన్సిక తన యాబైవ సినిమా ‘మహా’లో నటించింది. ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ మూత పడటంతో ఇక ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న తరుణంలో సినిమాపై హైకోర్టులో కేసు నమోదైంది. అది కూడా ఆ సినిమాను డైరెక్ట్ చేసిన డైరెక్టరే కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది.
‘మహా‘ సినిమా డైరెక్టర్ జమీల్ ఈ సినిమా విడుదలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. సినిమాలో కొంత భాగాన్ని తనకు తెలియకుండా, అసిస్టెంట్ డైరెక్టర్ సాయంతో కంప్లీట్ చేశారని ఆరోపించారు. కథకు అవసరమైన సన్నివేశాలను తెరకెక్కించలేదని తెలిపారు. ఎడిటింగ్ కూడా తన ప్రమేయం లేకుండా జరిగిందని, అలాగే తన రెమ్యునరేషన్ కూడా చెల్లించలేదని జమీల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ గండం నుండి హన్సిక సినిమా ఎలా గట్టెక్కుతుందో చూడాలి.