'జోహార్' దర్శకుడితో సినిమా స్టార్ట్ చేసిన జీఏ2 పిక్చర్స్
on Jun 30, 2022
జీఏ2 పిక్చర్స్ బ్యానర్ వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో దూసుకుపోతోంది. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన 'పక్కా కమర్షియల్' సినిమాతో రేపు (జులై 1న) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సంస్థ తాజాగా మరో ప్రాజెక్ట్ ని ప్రారంభించింది.
'జోహార్', 'అర్జున ఫల్గుణ' లాంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలు తెరకెక్కించిన తేజ మర్ని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాసుతో పాటు విద్య మాధురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి బన్నీ వాసు తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టింది.
ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. పూర్తిగా కంటెంట్ ప్రధానంగానే ఈ సినిమా కథ సాగుతుంది. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. భాను ప్రతాప్ సహ నిర్మాత, ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.